భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే కొత్తగా 583 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 10,000 దాటింది. ఇప్పటివరకు మహారాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,498 కేసులు నమోదవగా, ఒక్క ముంబయి నగరంలోనే 7,061 నమోదయ్యాయి. వీరిలో 1773 మంది కోలుకోని డిశ్చార్జ్ అవ్వగా, 459 మంది మృతిచెందారు. దేశంలో నమోదైన కరోనా మరణాల్లో అటుఇటుగా సగం మహారాష్ట్రలోనే నమోదు కావడం విశేషం. పుణేలో 1248, థానే లో 943, నాసిక్ లో 197, పాల్గర్ లో 169, నాగపూర్ లో 139 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో మొత్తం 733 కంటైన్మెంట్ జోన్లను గుర్తించామని, కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు ఉద్దవ్ థాకరే ప్రభుత్వం వెల్లడించింది.
మరోవైపు మే 1, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 35,043 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే అత్యధికంగా 1993 పాజిటివ్ కేసులు, 73 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 1147 కు చేరింది. దేశంలో మొత్తం కరోనా బాధితుల్లో 8889 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత రెండువారాలుగా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగిందని, ఆ రేటు 25.36 గా ఉందని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం 25,007 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu