కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ గడువు మే 3వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యలు, లాక్డౌన్ పొడిగింపు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, తదితరులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశం నిర్వహించారు.
మే 4 తేదీ నుంచి దేశంలో చాలా జిల్లాల్లో గణనీయమైన సడలింపులు ఉంటాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే కరోనా ప్రభావం ఎక్కువుగా ఉన్న రెడ్ జోన్, ఆరెంజ్ జోన్స్ లో ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఈ క్రమంలో ఈ రోజు సమావేశంలో ప్రజారవాణా లో భాగమైన విమాన సేవలు, రైళ్లను ప్రారంభించడం, బస్సులకు అనుమతి ఇవ్వడం అనే అంశాన్నే ప్రధాన అజెండాగా పెట్టుకుని చర్చినట్టుగా తెలుస్తుంది.
మరోవైపు ఇప్పటికే నమోదైన కరోనా పాజిటివ్ కేసులు, వైరస్ వ్యాప్తి చెందుతున్న విధానం, తదితర అంశాల ఆధారంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్ జోన్లలో మార్పులు చేసి కేంద్రం కొత్త జాబితా విడుదల చేసింది. కొత్త జాబితా ప్రకారం దేశవ్యాప్తంగా 130 రెడ్ జోన్ జిల్లాలు, 284 ఆరెంజ్ జోన్ జిల్లాలు, 319 గ్రీన్ జోన్ జిల్లాలు ఉన్నాయి. దీంతో 130 రెడ్ జోన్ జిల్లాలలో లాక్డౌన్ కొనసాగిస్తూ, మిగతా జోన్లలో కొత్త మార్గదర్శకాలు జారీ చేయనున్నారని సమాచారం.
లాక్డౌన్ అంశంపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఏప్రిల్ 27 న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. లాక్డౌన్ కొనసాగింపుకు కొందరు సీఎంలు మొగ్గుచూపగా, మరొకొందరు లాక్డౌన్ ఎత్తివేయాలని, ఆంక్షలు సడలించాలని సూచించారు. ఈ రోజు మంత్రులు, అధికారులతో భేటీ అనంతరం లాక్డౌన్ విధివిధానాలపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మళ్ళీ లాక్డౌన్ పొడిగిస్తారా? పూర్తీ స్థాయిలో లాక్డౌన్ ఎత్తివేయనున్నారా అనే విషయంపై దేశ ప్రజల్లో ఆసక్తి నెలకొనివున్న నేపథ్యంలో ఈ రోజు లేదా రేపు ప్రధాని మోదీ కీలక ప్రకటన చేయనున్నారని సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu