భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి పెరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మే 26, మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,45,380 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ గడువు మే 31 తో ముగియనుంది. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో లాక్డౌన్ను జూన్ 30 వరకు కొనసాగించనున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలోని హమీర్పూర్, సొలాన్ జిల్లాల్లో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతుండడంతో లాక్డౌన్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల రెడ్ జోన్స్ నుంచి దాదాపు 10వేల మందికి పైగా ప్రజలు హమీర్పూర్ వచ్చారని ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు. హమీర్పూర్లో అత్యధికంగా 63 వైరస్ కేసులు నమోదుకాగా, సొలాన్ జిల్లాలో 21 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఈ రెండు జిల్లాల్లో కొన్ని గంటల పాటు మాత్రమే కర్ఫ్యూ సడలించి, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు ప్రజలకు అవకాశం కల్పించనున్నారు. హిమాచల్ప్రదేశ్లో ఇప్పటిదాకా మొత్తం 223 కేసులు నమోదయ్యాయి. వీరిలో 63 మంది కోలుకోగా, ఈ వైరస్ వలన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu