రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, రాత్రిపూట కర్ఫ్యూ తదితర అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మే 27, బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ వర్షా కాలం సీజన్ నుంచి రాష్ట్రంలో అమలు చేసే నియంత్రిత పంటల సాగు విధానం, రాష్ట్ర అవతరణ వేడుకలు వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు.
రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ గడువు ఈ నెల 31 తో ముగియనుంది, మరోవైపు లాక్డౌన్ తదుపరి ప్రణాళికకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. దేశంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో సైతం జీహెఛ్ఎంసీ పరిధిలో కొత్త కేసులు క్రమంగా నమోదవుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో లాక్డౌన్ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, భవిష్యత్ కార్యాచరణ, ప్రణాళికల అమలుపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశముంది. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూన్ 2 న రాష్ట్ర అవతరణ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే నియంత్రిత పంటల సాగు విధానం పూర్తిస్థాయి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించి, ఈ అంశంపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu