భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3244 కరోనా పాజిటివ్ కేసులు, 87 కరోనా మరణాలు నమోదయ్యాయి. మే 12, మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 70,756 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2293 కి చేరింది. మరోవైపు కరోనా బాధితుల్లో 22,454 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 46,008 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువుగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికి 23,401 పాజిటివ్ కేసులు నమోదవగా, వీరిలో 4786 మంది కోలుకున్నారు…868 మంది మరణించారు. మహారాష్ట్రలో గతకొన్ని రోజులుగా ప్రతిరోజు కొత్తగా 1000 కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 1230 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. దేశంలో కరోనా మరణాలు కూడా అత్యధికంగా మహారాష్ట్ర రాష్ట్రంలోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత గుజరాత్ లో అత్యధికంగా 8,542, తమిళనాడులో 8,002 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో 1000 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 23,401
- గుజరాత్ – 8,542
- తమిళనాడు – 8,002
- ఢిల్లీ – 7,233
- రాజస్థాన్ – 4,035
- మధ్యప్రదేశ్ – 3,785
- ఉత్తర ప్రదేశ్ – 3,573
- పశ్చిమబెంగాల్ – 2,063
- ఆంధ్రప్రదేశ్ – 2,018
- పంజాబ్ – 1,877
- తెలంగాణ – 1,275
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu