కామన్వెల్త్ గేమ్స్లో ఒకవైపు భారత అథ్లెట్లు చెలరేగి పతకాలు సాధిస్తుండగా.. మరోవైపు మహిళల క్రికెట్ జట్టు కూడా అదే స్పూర్తితో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో టీమిండియా సెమీ ఫైనల్స్కు అర్హత సాధించింది. పోటీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా వుమెన్స్ సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో జరిగిన గ్రూప్ ఏ కీలక మ్యాచ్లో టీమిండియా బార్బడోస్ జట్టుపై 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా గ్రూప్-ఏ నుంచి సెమీస్కు అర్హత సాధించింది. తమ తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాపై పరాజయం చెందిన టీమిండియా ఆ తర్వాత పాకిస్తాన్ను ఓడించింది. తాజాగా బార్బడోస్పై గెలుపుతో సెమీఫైనల్కు అర్హత సాధించింది. కాగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య జరుగనున్న మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టుతో టీమిండియా సెమీస్లో తలపడనుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (46 బంతుల్లో 56 నాటౌట్, 6 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీ చేయగా.. షఫాలీ వర్మ (26 బంతుల్లో 43, 7 ఫోర్లు, 1 సిక్సర్), ఆఖర్లో దీప్తి శర్మ (28 బంతుల్లో 34, 2 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగడంతో భారత జట్టు ప్రత్యర్థికి భారీ స్కోరు టార్గెట్ గా ఇచ్చింది. అనంతరం 163 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన బార్బడోస్ మహిళల జట్టు భారత్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 62 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. ఆ జట్టులో కోషోనా నైట్ 16 పరుగులు, షకీరా 12 పరుగులు మాత్రమే చేయగా, మిగిలిన వారు రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. టీమిండియా వుమెన్స్ బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లు తీయగా.. మేఘనా సింగ్, స్నేహ్ రాణా, రాదా యాదవ్, హర్మన్ప్రీత్ కౌర్లు తలా ఒక వికెట్ తీశారు. ముఖ్యంగా భారత బౌలర్ రేణుకా సింగ్ నాలుగు ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్ల తీయడం విశేషం. దీంతో టీమిండియా 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడమే కాకుండా సెమీస్కు కూడా చేరింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY