కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కశ్మీర్ పై పాకిస్తాన్ అనుసరిస్తున్న తీరును తప్పుపట్టారు. గురువారం నాడు రాజ్నాథ్ సింగ్ లద్దాఖ్ ను సందర్శించారు. లద్దాఖ్ లోని లేహ్ లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ (డిఐహెఛ్ఆర్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించే 26వ కిసాన్-జవాన్ విజ్ఞాన మేళాను ఆయన ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 ను రద్దు చేసిన తరువాత మొదటిసారిగా రక్షణ మంత్రి లద్దాఖ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే అని చెప్పారు. ఉగ్రవాదాన్ని పోషించి, భారత్ పై ప్రయోగిస్తున్న పాకిస్తాన్ పై మాట్లాడేది ఏమి లేదని, ఉగ్రవాద నిర్మూలనకు పాకిస్తాన్ తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
జమ్మూ కశ్మీర్ పునర్విభజన కింద రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. లద్దాఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చి కేంద్రప్రభుత్వం అక్కడి అభివృద్ధిపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పర్యటిస్తున్న రాజ్నాథ్ సింగ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. భద్రతా వ్యవహారాలపై స్థానిక అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వ నిర్ణయం వలన ఆ ప్రాంతంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాలపై అధికారులతో చర్చలు జరపబోతున్నట్టు సమాచారం.
[subscribe]
[youtube_video videoid=RhG9jc1cVwk]