ఫిబ్రవరి 19, గురువారం నాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. మూడోసారి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా అమిత్ షాతో కేజ్రీవాల్ సమావేశయ్యారు. అమిత్ షా నివాసంలో దాదాపు అరగంటకు పైగా ఈ భేటీ జరిగినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంపై అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో స్పందించారు. ‘ గౌరవ హోం మంత్రి అమిత్ షాను కలిశాను. చాలా మంచి మరియు ఫలప్రదమైన సమావేశం జరిగింది. ఢిల్లీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించాను. ఢిల్లీ అభివృద్ధి కోసం పరస్పరం కలిసి పనిచేసేందుకు మేమిద్దరం అంగీకారానికి వచ్చామని’ కేజ్రీవాల్ పేర్కొన్నారు. మరోవైపు షాహీన్ బాగ్ సమస్యపై అమిత్ షాతో చర్చించలేదని అరవింద్ కేజ్రీవాల్ తెలిపినట్టుగా తెలుస్తుంది.
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. అలాగే ఫిబ్రవరి 16న ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రసంగంలో, ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు కోరి, దేశ రాజధాని ఢిల్లీలో సజావుగా పరిపాలన సాగించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేయాలని కోరుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు అమిత్ షాతో కేజ్రీవాల్ భేటీ కావడం మరింతగా ప్రాధాన్యత సంతరించుకుంది.
[subscribe]