ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 19, బుధవారం నాడు విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు జెన్, ట్రాన్స్ కో యొక్క ఆర్థిక పరిస్థితులను సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో డిస్కంలను రుణభారం, బకాయిల నుంచి గట్టెక్కించే మార్గాలపై కీలకంగా చర్చించారు. నాణ్యమైన విద్యుత్ను తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ఎవరైనా ముందుకు వస్తే వారితో ఒప్పందాలు కుదుర్చుకోవాలని, దీని వల్ల డిస్కంలపై కొంతమేర భారం తగ్గుతుందని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు.
అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేయదలచుకున్న 10వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్పైనా కూడా దృష్టిపెట్టాలని అధికారులను కోరారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కాలక్రమంలో ఈ ప్లాంట్ను విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. కృష్ణపట్నం స్టేజ్ -2, వీటీపీఎస్ స్టేజ్-5 ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశాలిచ్చారు. జెన్కో థర్మల్ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గు వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా హైడ్రో రివర్స్ పంపింగ్ ప్రాజెక్టులపైనా దృష్టిపెట్టాలని సీఎం స్పష్టం చేశారు. విద్యుత్ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు అత్యుత్తమ సంస్థల్లో శిక్షణ ఇప్పించాలని, ఈ రంగంలో ఎలాంటి అవినీతి చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
[subscribe]