మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మలుపులు కారణంగా మార్చ్ 18, బుధవారం ఉదయం బెంగుళూరులో హైడ్రామా నెలకుంది. మధ్యప్రదేశ్ రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరులోని రమదా హోటల్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ బెంగళూరుకు చేరుకుని పార్టీ కార్యకర్తలతో కలిసి రెబల్ ఎమ్మెల్యేలున్న రమదా హోటల్కు వెళ్లే ప్రయత్నం చేశారు. హోటల్ వద్ద పోలీసులు ఆయనను అడ్డుకుని లోపలికి వెళ్లనీయలేదు. దీంతో దిగ్విజయ్ సింగ్ తో పాటుగా పలువురు కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టుచేశారు.
అరెస్ట్ పై దిగ్విజయ్సింగ్ ట్విట్టర్లో స్పందిస్తూ, “మమ్మల్ని బెంగళూరు పోలీసులు స్థానిక డిసిపి కార్యాలయానికి తీసుకెళ్లారు. బీజేపీ ఆధీనంలో ఉన్న మా ఎమ్మెల్యేలను కలవడానికి అనుమతించాలని నేను కోరుతున్నాను. మా ఎమ్మెల్యేలను కలవడానికి అనుమతించే వరకు నేను దీక్షను కొనసాగిస్తానని ప్రకటిస్తున్నాను. మనం నియంతృత్వంలో కాకుండా ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని” పేర్కొన్నారు.
ముందుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేత, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో అతని వర్గీయులైన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో ఆరుగురి రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభం అంచున నిలుచుంది. ఈ క్రమంలో అసెంబ్లీలో వెంటనే బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా అసెంబ్లీ సమావేశాలను మార్చ్ 26వ తేదికి వాయిదా వేస్తునట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రెబెల్ ఎమ్మెల్యేలు అంతా బెంగుళూరు క్యాంపుకు చేరుకున్నారు.