దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించడం వలన మార్చ్ నెల చివరి నుంచి దేశీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రజా రవాణాకు సంబంధించి ఇప్పటికే బస్సులు, రైళ్ల ప్రయాణాలపై ప్రకటనలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా దేశీయ విమాన ప్రయాణాలపై కూడా కీలక ప్రకటన చేసింది. మే 25 వ తేదీ నుంచి దశల వారీగా దేశీయ విమాన సేవలు మొదలవుతాయని పౌర విమానయాన శాఖా మంత్రి హర్దీప్సింగ్ పూరీ ఈ రోజు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తీ సమాచారాన్ని, విధివిధానాలను విమానయాన సంస్థలు, ఎయిర్పోర్టులకు అందించామని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రయాణికుల పాటించాల్సిన సూచనలు, జాగ్రత్తలతో కూడిన మార్గదర్శకాలను ప్రత్యేకంగా విడుదల చేస్తామని అని మంత్రి హర్దీప్సింగ్ తెలిపారు.
మరోవైపు కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ 4.0 కు సంబంధించి కేంద్రప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల్లో దేశంలో కంటైన్మెంట్ జోన్ ప్రాంతాల మినహా బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు ముందుగా అనుమతిచ్చారు. అనంతరం జూన్ 1 వ తేదీ నుంచి రోజువారీగా 200 పాసెంజర్ నాన్-ఏసీ రైళ్లను నడపనున్నట్టు మంగళవారం నాడు రైల్వే శాఖ ప్రకటించింది. తాజాగా దేశీయ విమాన ప్రయాణాలపై కూడా ప్రకటన చేయడంతో, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు తప్ప అన్నిరకాల ప్రయాణాలకు అనుమతి ఇచ్చినట్టు అయింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu