భారత మాజీ రాష్ట్రపతి, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఇటీవల ఆయనకు మెదడుకు సంబంధించి ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. అదే సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు గుర్తించారు. అప్పటి నుంచే కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తూ, ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో సోమవారం నాడు ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రణబ్ ముఖర్జీ మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్బూమ్ జిల్లాలో గల మిరాటి గ్రామంలో
ప్రణబ్ ముఖర్జీ జన్మించారు. హిస్టరీ, పొలిటికల్ సైన్స్ లో ఎంఏ తో పాటుగా ఎల్ఎల్బీ కూడా చేశారు. అనంతరం కొంతకాలం టీచర్ గా, జర్నలిస్టుగా పనిచేశారు. తన యాభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రణబ్ ముఖర్జీ ఎన్నో పదవులు చేపట్టి దేశానికి సేవలు అందించారు. 1969లో తొలిసారిగా ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1973 లో తొలిసారిగా ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆతర్వాత ఎన్నోసార్లు కేంద్రమంత్రిగా పనిచేశారు.
కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగి, ఎన్నో సందర్భాల్లో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. కాంగ్రెస్ లో ఎలాంటి వివాద పరిష్కారం కోసమైనా అధిష్టానం ప్రణబ్ ముఖర్జీకి బాధ్యతలు అప్పగించేది. ఆర్ధిక మంత్రిగా, విదేశాంగ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా ప్రణబ్ ముఖర్జీ తనదైన ముద్రవేసి సంస్కరణలు చేపట్టారు. 2012 నుంచి 2017 వరకు దేశానికి 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2008 లో పద్మవిభూషణ్ అవార్డు అందుకోగా, 2019 లో భారతరత్నతో ప్రణబ్ ముఖర్జీని కేంద్రప్రభుత్వం గౌరవించింది.
ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలు పార్టీల నాయకులు ప్రణబ్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలు గుర్తుచేసుకుని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. మరోవైపు ప్రణబ్ ముఖర్జీ అందించిన సేవలను స్మరించుకొనేందుకు దేశ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాపం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రణబ్ ముఖర్జీకి అధికార లాంఛనాలతో, సైనిక గౌరవ వందనంతో వీడ్కోలు పలికేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
With a Heavy Heart , this is to inform you that my father Shri #PranabMukherjee has just passed away inspite of the best efforts of Doctors of RR Hospital & prayers ,duas & prarthanas from people throughout India !
I thank all of You 🙏— Abhijit Mukherjee (@ABHIJIT_LS) August 31, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu