వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల చేస్తున్న ఉద్యమం కొనసాగుతూనే ఉంది. చట్టాలను రద్దు చేసేంతవరకు ఉద్యమం ఆపేదిలేదంటూ రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు (ఫిబ్రవరి 6, శనివారం) నాడు దేశవ్యాప్తంగా ‘చక్కా జామ్’ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య మూడు గంటల పాటుగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. జనవరి 26 న నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ తర్వాత రైతులు పిలుపునిచ్చిన కార్యక్రమం ఇదే కావడంతో ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
చక్కా జామ్ కార్యక్రమం ఢిల్లీలో నిర్వహించడం లేదని రైతులు హామీ ఇచ్చినప్పటికీ, గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఉద్యమం చేస్తున్న సింఘు, ఘాజీపూర్, టీక్రి ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించి పోలీసులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. అదనపు బలగాలను మోహరించడం, బారికేడ్లు పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. చక్కా జామ్ కార్యక్రమం శాంతియుతంగా ఉంటుందని భారతీయ కిసాన్ యూనియన్ (బికేయూ) నాయకుడు రాకేశ్ తికైట్ పేర్కొన్నారు. రేపు ఉత్తర ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్, ఢిల్లీ మినహా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రహదారుల దిగ్బంధనం ఉంటుందని తెలిపారు. మరోవైపు అంబులెన్స్, స్కూల్ బస్సులు మరియు అత్యవసర మరియు అవసరమైన సేవలు నిలిపివేయవద్దని రైతు సంఘాలు నిర్ణయించాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ