భారత్ మాజీ క్రికెటర్ యశ్పాల్ శర్మ కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. యశ్పాల్ శర్మ ఆగస్టు 11, 1954న పంజాబ్ లోని లూధియానాలో జన్మించారు. 1979 లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన యశ్పాల్ శర్మ 1983 వరకు భారత్ క్రికెట్ జట్టు మిడిల్ ఆర్డర్ లో కీలకపాత్ర పోషించారు. భారత్ తరఫున యశ్పాల్ 37 టెస్టులు ఆడి 1,606 పరుగులు, 42 వన్డేల్లో 883 పరుగులు చేశారు. ముఖ్యంగా 1983లో వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత్ జట్టులో యశ్పాల్ శర్మ సభ్యుడిగా ఉన్నారు.
ఈ ప్రపంచకప్ లో వెస్టిండీస్తో జరిగిన తొలి మ్యాచ్లోనే 89 పరుగులు, సెమీ ఫైనల్స్ లో ఇంగ్లండ్ పై 60 పరుగులు చేయడం సహా 34.28 సగటుతో మొత్తం 240 పరుగులు చేసి భారత్ ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం 1985 లోనే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. అలాగే 2000 సమయంలో జాతీయ జట్టు సెలక్టర్ గా కూడా పనిచేశారు. యశ్పాల్ శర్మ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖ క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ