ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐపీఎల్-2022 కు ముందుగా అన్ని ఫ్రాంచైజీలు కోచింగ్ స్టాఫ్ నియామకంపై దృష్టిపెట్టాయి. తాజాగా ఐపీఎల్ లో ప్రధాన ప్రాంచైజీలలో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ శుక్రవారం నాడు మరో ఇద్దరు కొత్త కోచింగ్ స్టాఫ్ వివరాలను ప్రకటించింది. శ్రీలంక మాజీ ఆటగాడు లసిత్ మలింగను ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా నియమించినట్టు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటన చేసింది. అలాగే టీమ్ క్యాటలిస్ట్ గా కొత్త పాత్రలో ప్యాడీ అప్టన్ ను కూడా చేర్చుకున్నట్టు తెలిపారు.
అత్యుత్తమ పరిమిత ఓవర్ల బౌలర్ లలో ఒకరిగా పేరుగాంచిన మలింగ ఈ సీజన్లో జట్టు బౌలింగ్ వ్యూహాలను పర్యవేక్షిస్తాడని పేర్కొన్నారు. టీ20 క్రికెట్పై తనకున్న జ్ఞానం మరియు నైపుణ్యాన్ని అందించడం ద్వారా యువ బౌలర్ల అభివృద్ధిని వేగవంతం చేస్తాడని ఆశిస్తున్నట్టు తెలిపారు. 17 సంవత్సరాల తన క్రికెట్ కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి శ్రీలంక తరపున 340 మ్యాచ్లలో మలింగ ప్రాతినిధ్యం వహించాడు, అలాగే 546 వికెట్లు తీశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబయి ఇండియన్స్ తరపునే ప్రాతినిధ్యం వహించిన మలింగ, మొత్తం 122 మ్యాచ్లలో 170 వికెట్లు పట్టుగొట్టాడు. ఇటీవల శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 సిరీస్ కు శ్రీలంక బౌలింగ్ స్ట్రాటజీ కోచ్గా మలింగ పనిచేశాడు
రాజస్థాన్ రాయల్స్ పాస్ట్ బౌలింగ్ కోచ్ గా తన నియామకంపై మలింగ మాట్లాడుతూ, “ఐపీఎల్కు తిరిగి రావడం అద్భుతమైన అనుభూతి మరియు యువ ప్రతిభను ఎల్లప్పుడూ ప్రోత్సహించే మరియు అభివృద్ధి చేసే ఫ్రాంచైజీ అయిన రాజస్థాన్ రాయల్స్లో చేరడం నాకు గొప్ప గౌరవం. రాజస్థాన్ రాయల్స్ పేస్ బౌలింగ్ యూనిట్ పట్ల సంతోషిస్తున్నాను. టోర్నమెంట్కి వెళ్లి, ఫాస్ట్ బౌలర్లందరికీ వారి గేమ్-ప్లాన్ల అమలు చేయడం మరియు ప్రదర్శనకు మద్దతు ఇవ్వాలని ఎదురుచూస్తున్నాను” అని పేర్కొన్నారు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న తన సహచరుడైన శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని మలింగ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ