సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టు భారత్ లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య సెప్టెంబర్ 28, అక్టోబర్ 2, 4 తేదీల్లో మూడు టీ20ల సిరీస్, అక్టోబర్ 6, 9, 11వ తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. కాగా సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ కోసం భారత్ జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించగా, తాజాగా ఈ సిరీస్ ఆడే భారత్ టీ20 జట్టులో చోటుచేసుకున్న మార్పులపై బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉమేష్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, షాబాజ్ అహ్మద్లు భారత్ జట్టులోకి వచ్చారని తెలిపారు.
దీపక్ హుడా వెన్ను గాయం కారణంగా సౌత్ ఆఫ్రికాతో జరగబోయే సిరీస్ ల నుండి తప్పుకున్నాడని, ఈ ఆల్ రౌండర్ తన గాయం యొక్క తదుపరి నిర్వహణ కోసం నేషనల్ క్రికెట్ అకాడమీలో (ఎన్సీఏ) ఉన్నాడని చెప్పారు. హార్దిక్ పాండ్యా మరియు భువనేశ్వర్ కుమార్ కూడా కండిషనింగ్-సంబంధిత పని కోసం ఎన్సీఏకి రిపోర్ట్ చేశారని, అయితే అర్ష్దీప్ సింగ్ తిరువనంతపురంలో జట్టుతో కలిశాడని పేర్కొన్నారు. అలాగే మహమ్మద్ షమీ ఇంకా కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకోకపోవడంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో పాల్గొనలేడని చెప్పారు. దీంతో ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ షమీ స్థానంలో ఉమేష్ యాదవ్ను, హుడా స్థానంలో శ్రేయాస్ అయ్యర్ను ఎంపిక చేసిందన్నారు. అలాగే షాబాజ్ అహ్మద్ కూడా టీ20 జట్టులోకి వచ్చాడని బీసీసీఐ ప్రకటించింది.
ఇక భారత్-సౌత్ ఆఫ్రికాతో మధ్య నేడు (సెప్టెంబర్ 28, బుధవారం) తిరువనంతపురంలో తోలి టీ20 జరగనుంది. గౌహతిలో అక్టోబర్ 2న రెండవ టీ20, ఆ తర్వాత ఇండోర్లో అక్టోబర్ 4న చివరిదైన మూడో టీ20 జరుగుతుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగింట దక్షిణాఫ్రికా జరిగే ఈ హోమ్ సిరీస్ భారత్ జట్టు సన్నాహకానికి కీలకం కానుంది.
సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ కు భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, షాబాజ్ అహ్మద్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY