రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న రెజ్లర్లు తమ పోరాటాన్ని తీవ్రతరం చేశారు. శుక్రవారం వారు భారత ఒలింపిక్ సంఘాన్ని (ఐఓఏ) ఆశ్రయించారు. డబ్ల్యుఎఫ్ఐ అధ్యక్షుడి లైంగిక వేధింపులపై తక్షణమే విచారణ ప్యానెల్ను ఏర్పాటు చేయాలని కోరారు. కాగా డబ్ల్యుఎఫ్ఐ ప్రెసిడెంట్ మహిళా రెజ్లర్లను ఏళ్ల తరబడి లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని స్టార్ రెజ్లర్, ప్రపంచ చాంపియన్షిప్ పతక విజేత, ఒలింపియన్ అయిన వినేష్ ఫోగట్ బుధవారం ఆరోపించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే డబ్ల్యుఎఫ్ఐ అధ్యక్షుడి తీరును నిరసిస్తూ దేశరాజధాని జంతర్ మంతర్ వద్ద అనేకమంది మహిళా రెజ్లర్లు ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. వీరి నిరసనకు పురుష రెజ్లర్లు కూడా మద్దతు పలుకుతున్నారు.
ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉషకు రాసిన లేఖలో.. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చేతిలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులతో పాటు ఇతర సహోద్యోగులు కూడా దీనిని ఎదుర్కొన్నట్లు తమకు తెలియజేసినట్లు రెజ్లర్లు తెలిపారు. ఇక ఈ లేఖపై టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలు రవి దహియా, బజరంగ్ పునియా సహా ఐదుగురు రెజ్లర్లు సంతకం చేశారు. వీరితో పాటు రియో గేమ్స్ కాంస్య విజేత సాక్షి మాలిక్, ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేతలు వినేష్ ఫోగట్, దీపక్ పునియాలు కూడా సంతకం చేశారు. డబ్ల్యుఎఫ్ఐని రద్దు చేయాలని, దాని అధ్యక్షుడిని తొలగించాలని రెజ్లర్లు తమ డిమాండ్ను పునరుద్ఘాటించారు. ఆయనను తొలగించకపోతే ఎంతోమంది యువ రెజ్లర్ల కెరీర్ లు అర్ధాంతరంగా ముగిసిపోతాయని, మా అందరికీ ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జాతీయ సమాఖ్య వ్యవహారాలను నిర్వహించడానికి రెజ్లర్లుతో సంప్రదించి కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE