రాష్ట్రంలో బాధ్యతా యుతమైన, పర్యావరణహిత టూరిజాన్ని/రెస్పాన్సిబుల్ ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దీనిలో భాగంగా అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వుల సమీపంలో మరిన్ని ఎకో టూరిజం ప్రాంతాలను అభివృద్ది చేస్తామని తెలిపారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో పూర్తి అయిన వివిధ ఎకో టూరిజం ప్రాజెక్టులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో అద్భుత, ప్రకృతి రమణీయమైన ప్రాంతాలు ఒక్కొటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని, వాటి ప్రత్యేకతను కాపాడుతూనే, ప్రజలకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తామని మంత్రి అన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో మన్ననూరు వద్ద ఎకో టూరిజం రిసార్ట్, ఆరు కాటేజీలు, ఎనిమిది కొత్త సఫారీ వాహనాలను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పర్యాటకుల సమక్షంలో మంత్రి ప్రారంభించారు.
పర్యాటకులు ఒక రోజు పాటు అమ్రాబాద్ లో గడిపేందుకు వీలుగా రూపొందించిన టైగర్ స్టే ప్యాకేజీ ఇకపై ఆన్ లైన్ లో బుక్ చేసుకునేందుకు వీలుగా పోర్టల్ ను ప్రారంభించారు. అమ్రాబాద్ వచ్చే సందర్శకులకు సేవలు అందించేందుకు కొత్తగా శిక్షణను ఇచ్చిన గైడ్లు ఇకపై అందుబాటులో ఉంటారని అటవీ శాఖ ప్రకటించింది. అటవీ పర్యవేక్షణ నేరుగా చేసేందుకు వీలుగా కొత్తగా 10 లైవ్ నిఘా కెమెరాలు నేటి నుంచి పనిచేయటం మొదలయింది. స్థానిక గిరిజన, చెంచు మహిళలకు ఉపాధి కల్పించే జ్యూట్ బ్యాగుల తయారీ, హెల్త్ క్లినిక్, ప్లాస్టిక్ రీ సైక్లింగ్ సెంటర్, బయో ల్యాబ్ ల సందర్శించిన మంత్రి, అక్కడ పనిచేసే వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమ్రాబాద్ తో పాటు అటవీ ప్రాంతాల్లో పర్యటించే, ప్రయాణించే ప్రతీ ఒక్కరూ బాద్యతాయుతంగా ఉండాలని మంత్రి కోరారు. అన్ని అడవులు ప్లాస్టిక్ ఫ్రీ జోన్లుగా ప్రకటించామని, వన్యప్రాణులకు హాని చేసే ప్లాస్టిక్ కు అడవుల నుంచి దూరంగా ఉంచాలని తెలిపారు. జాతీయ సంపదలు అయిన అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమాల్లో ఎంపీ పీ.రాములు, స్థానిక ఎమ్మెల్యే, విప్ గువ్వల బాలరాజు, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పీసీసీఎఫ్ అండ్ హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, ఎఫ్డీసీ వీసీ అండ్ ఎండీ చంద్ర శేఖర్ రెడ్డి, అమ్రాబాద్ ఫీల్డ్ డైరక్టర్ క్షితిజ, డీఎఫ్ఓ నాగర్ కర్నూల్ రోహిత్, ఎఫ్డీఓలు నవీన్ రెడ్డి, బీ.విశాల్, వై.శ్రీనివాస్, సర్వేశ్వర్, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అమ్రాబాద్ పులుల అభయారణ్యం – అటవీ శాఖ చేసిన అభివృద్ది:
- నల్లమల అటవీ ప్రాంతంలో ఈ అమ్రాబాద్ పులుల అభయారణ్యం విస్తరించింది. కృష్ణ నది 175 కిలో మీటర్ల పొడవునా ఈ అభయారణ్యం గుండా ప్రవహిస్తుంది. మొత్తం విస్తీర్ణం 2611.39 చదరపు కిలోమీటర్లు. నాగర్ కర్నూల్ జిల్లాలో అమ్రాబాద్, అచ్చంపేట అటవీ డివిజన్లు, నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ అటవీ డివిజన్ అభయారణ్యం పరిధిలో ఉన్నాయి. మొత్తం 3 రేంజిలు, 54 సెక్షన్లు, 254 బీట్లు ఉన్నాయి. 22 బేస్ క్యాంపులు, 2 చెక్ పోస్టులు ఉన్నాయి.
- ఈ అభయారణ్యంలో 21 పులులు ఉన్నట్టు జాతీయ పులుల గణన నివేదిక (AITE–2022) ద్వారా గుర్తించారు. ఈ సంఖ్య 2018 లో కేవలం 12 మాత్రమే. ఇంకా ఇక్కడ అడవి పందులు, సాంబార్, నీల్గాయి దుప్పులు, చిరుతలు ఉన్నాయి.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో తీసుకుంటున్న చర్యలు:
- గడ్డి మైదానాలు పెంచడం.
- కలుపు నివారణ (వీడ్ రిమూవల్) (2018 నుంచి ఇప్పటిదాకా 4463 హెక్టార్లలో తొలగించారు).
- అగ్ని ప్రమాద నివారణ చర్యలు.
- ప్రతి 4 చ.కి.మీకు ఒక నీటి సౌకర్య ప్రాంతం (ఒక గ్రిడ్) మొత్తం 649 గ్రిడ్ లకు నీటి సౌకర్యం ఏర్పాటు.
- 160 – ఊట చెరువులు, 99 చెక్ డ్యామ్స్, 1149 సాసర్ పిట్స్, 29 సోలార్ బోర్ వెల్స్ ఏర్పాటు.
- కెమెరా ట్రాప్ లు ఏర్పాటు. మొత్తం 300 కెమెరా ట్రాప్ లు ఏర్పాటు.
- అభయారణ్యం మొత్తాన్ని ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా గుర్తించడమైనది. ప్లాస్టిక్ చెత్త ఉంటే దాన్ని తొలగించటానికి 13 మందిని నియమించారు. సేకరించిన చెత్తను సెగ్రిగేషన్ పాయింట్ కు తరలిస్తారు.
ఎకో టూరిజం:
- పర్యాటకానికి అనువైన ప్రాంతం. అనేక వృక్ష, జంతు జాతులు ఉన్నాయి. అనేక పుణ్యక్షేత్రాలు ఈ అటవీ ప్రాంతంలో ఉన్నాయి. శ్రీశైల పుణ్య క్షేత్రానికి వెళ్ళడానికి ఇదే అనువైన దారి. ఉమా మహేశ్వరం, మల్లెల తీర్థం, సలేశ్వరం, మద్దిమడుగు పవిత్ర దేవాలయాలకు నెలవు.
- ఫరహాబాద్, గుండం సఫారీలు ఇది వరకే అందుబాటులో ఉన్నాయి.
- కొత్తగా ఉమా మహేశ్వరం నుంచి ఋషుల చెరువు వరకు ఒకటి, దోమలపెంట మరొక సఫారీ మార్గాలు త్వరలో ప్రారంభించటం జరుగుతుంది.
- ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఆర్థిక సహకారంతో రూ.1.20 కోట్లతో కొత్తగా 8 సఫారీ వాహనాలు కొనుగోలు చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం.
- టైగర్ స్టే ప్యాకేజీలో భాగంగా కొత్తగా రూ.90 లక్షలతో 6 కాటేజ్ లు (ఇందులో మడ్ హౌసెస్, ట్రీ హౌసెస్ లు ఉన్నాయి).
- అటవీ పరిరక్షణ మరియు పర్యవేక్షణకు రూ.25,000 లకు ఒకటి చొప్పున 10 నిఘా కెమెరాలు ఏర్పాటు.
ఇతర కార్యక్రమాలు:
- స్థానికుల భాగస్వామ్యం పెరగటానికి స్థానిక విద్యార్థుల కోసం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహణ. వీరికి ఇవాళ (జనవరి 20) బ్యాడ్జెస్ అందజేత.
- ఈ ప్రాంతంలో 23 చిన్న చెంచు గిరిజన గ్రామాలున్నాయి. వీరి ఉపాధి కోసం బేస్ క్యాంపు వాచర్లు, ప్రొటెక్షన్ వాచర్లు, ఫారెస్ట్ ఫైర్ వాచర్లు, యానిమల్ ట్రాకర్లు, నేచర్ గైడ్లుగా 105 చెంచులు, 54 ఎస్సీలను అటవీ శాఖ నియమించింది.
- స్థానిక గిరిజన మహిళలకు జ్యూట్ బ్యాగుల తయారీలో శిక్షణ.
- తేనే సేకరణకు 100 యూనిట్లు పంపిణి.
- 19 మంది స్థానిక యువతకు టూరిజంలో అనుభవం కోసం నీతమ్ లో శిక్షణ.
- 15 మంది స్థానిక యువతకు డ్రైవింగ్ లో శిక్షణ
- మెడికల్ క్యాంపుల నిర్వహణ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE