భారత్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య డిసెంబర్ 4, 7, 10 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. బంగ్లాదేశ్ తో జరిగే వన్డే సిరీస్ కోసం ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఇప్పటికే భారత్ జట్టును ఎంపిక చేయగా, తాజాగా భారత్ వన్డే జట్టులో చోటుచేసుకున్న ఓ మార్పుపై బీసీసీఐ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. బంగ్లాదేశ్తో జరగనున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్కి గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ దూరమయ్యాడు. ఈ క్రమంలో మహమ్మద్ షమీ స్థానంలో వన్డే జట్టులోకి ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ను ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్టు బీసీసీఐ తెలిపింది.
“బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు ముందు జరుగుతున్న శిక్షణలో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ భుజానికి గాయమైంది. అతను ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో (ఎన్సీఏ) బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు మరియు మూడు మ్యాచ్ల సిరీస్లో పాల్గొనలేడు. దీంతో ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ను ఎంపిక చేసింది” అని బీసీసీఐ సెక్రటరీ జై షా ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా రేపు (డిసెంబర్ 4, ఆదివారం) ఉదయం 11.30 గంటలకు ఢాకా లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య తోలి వన్డే జరగనుంది.
బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE