ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 క్రికెట్ లీగ్లలో ఒకటైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తుది అంకానికి చేరుకుంది. ఈరోజు (ఆదివారం, మే 28, 2023) అహ్మదాబాద్ వేదికగా మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరియు హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మధ్య మెగా ఫైనల్ జరుగనుంది. తొలుత గుజరాత్ టైటాన్స్ పైన అద్భుత విజయం సాధించి ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్స్ చేరుకోగా.. తాజాగా గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-2లో ముంబయిపై విజయంతో ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2లో ముంబయిపై 62 పరుగుల తేడాతో ఆ జట్టు ఘన విజయం సాధించింది.
తద్వారా హార్దిక్ పాండ్యా నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ టోర్నీలో వరుసగా రెండో ఏడాది ఫైనల్లో అడుగు పెట్టింది. కాగా ఇప్పటికే ఈ టోర్నీలో 3 సెంచరీలు చేసిన గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుబ్మన్ గిల్ పైనే అందరి దృష్టి ఉంది. ఈ రోజు మ్యాచ్లో అతడు మరోసారి చెలరేగాలని గుజరాత్ కోరుకుంటుండగా.. ధోని తనదైన కెప్టెన్సీతో అతడిని ఎలా కట్టడి చేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ధోని సారథ్యంలో చెన్నై మొత్తం 10 సార్లు ఫైనల్స్ చేరడం గమనార్హం. మరోవైపు ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అవుతుందనే ఊహాగానాల మధ్య చెన్నై జట్టు సర్వశక్తులూ ఒడ్డనుంది. దీంతో రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక టోర్నమెంట్లో విజేత ఎవరో తేలాలంటే.. మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఫైనల్ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఇక ఆట ప్రారంభానికి ముందు, ముగింపు వేడుకను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘనంగా నిర్వహించనుంది. ప్రముఖ రాపర్లు ఇందులో ప్రదర్శన ఇవ్వనున్నారు. పర్స్ కింగ్, డీజే న్యూక్లియా ప్రదర్శన ఇవ్వనున్నారు. మిడ్ టైమ్ షోలో ఆయనతో పాటు దేవీన్, జోనితా గాంధీ అభిమానులను అలరించనున్నారు. మ్యాచ్కు ముందు కింగ్ అండ్ న్యూక్లియా అభిమానులను అలరించనుండగా, మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ తర్వాత జోనితా గాంధీ, డివైన్ జోడీ ప్రదర్శన ఇవ్వనున్నారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ ప్రైజ్ మనీ దాదాపు రూ.46.5 కోట్లుగా నిర్ణయించారు. నేటి మ్యాచ్లో గెలిచిన జట్టు రూ.20 కోట్లు అందుకోనుండగా.. ఫైనల్లో ఓడిన జట్టు (రన్నరప్) రూ.13 కోట్లు దక్కించుకోనుంది. అలాగే ఈ రెండు జట్లతో పాటు మూడో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ మరియు నాలుగో స్థానంలో నిలిచిన లక్నో సూపర్జెయింట్లు కూడా భారీ మొత్తాన్ని బహుమతిగా అందుకోనున్నాయి.
- విజేత జట్టు- రూ. 20 కోట్లు
- రన్నరప్ జట్టు- రూ. 13 కోట్లు
- మూడో స్థానంలో ఉన్న జట్టు (ముంబై ఇండియన్స్)- రూ. 7 కోట్లు
- నాల్గవ స్థానంలో ఉన్న జట్టు (లక్నో సూపర్ జెయింట్స్)- రూ. 6.5 కోట్లు
- ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్- రూ. 20 లక్షలు
- సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్- రూ. 15 లక్షలు
- ఆరెంజ్ క్యాప్ హోల్డర్- రూ. 15 లక్షలు (అత్యధిక పరుగులు)
- పర్పుల్ క్యాప్ హోల్డర్ – రూ. 15 లక్షలు (అత్యధిక వికెట్లు)
- సీజన్లో అత్యంత విలువైన ఆటగాడు- రూ. 12 లక్షలు
- అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడికి – రూ. 12 లక్షలు.
- సీజన్ గేమ్ ఛేంజర్ కోసం- రూ. 12 లక్షలు.
ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
- శుభమన్ గిల్ (గుజరాత్ టైటాన్స్) – 851 పరుగులు
- ఫాఫ్ డు ప్లెసిస్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)- 730 పరుగులు
- విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)- 639 పరుగులు
- డెవాన్ కాన్వే (చెన్నై సూపర్ కింగ్స్)- 625 పరుగులు
- యస్సవి జైస్వాల్ (రాజస్థాన్ రాయల్స్)- 625 పరుగులు
అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు..
- మహ్మద్ షమీ (గుజరాత్ టైటాన్స్)- 28 వికెట్లు
- రషీద్ ఖాన్ (గుజరాత్ టైటాన్స్)- 27 వికెట్లు
- మోహిత్ శర్మ (గుజరాత్ టైటాన్స్)- 24 వికెట్లు
- పీయూష్ చావ్లా (ముంబై ఇండియన్స్) – 22 వికెట్లు
- యుజ్వేంద్ర చాహల్ (రాజస్థాన్ రాయల్స్) 21 వికెట్లు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE