దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని నేడు (ఆదివారం, మే 28, 2023) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మే 18న ప్రధాని మోదీని కలిసి కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించారు. ఇక కొత్త పార్లమెంట్ భవనం భారతదేశ స్ఫూర్తికి ప్రతీక అని లోక్సభ సెక్రటేరియట్ పేర్కొంది. కాగా ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహించనున్నారు. పార్లమెంట్లోని గాంధీ విగ్రహం దగ్గర పండల్ (పందిరి)లో జరిగే ఆచారాలతో వేడుక ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ఉదయం 9.30 గంటలలోపే పూర్తి కానున్నాయి.
అనంతరం మధ్యాహ్నం సమయంలో రెండో దశ ప్రారంభ వేడుకలు మొదలుకానున్నాయి. లోక్సభ ఛాంబర్లో ప్రముఖులందరి సమక్షంలో జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. దిగువ సభలోని ఛాంబర్లో 888 మంది సభ్యులు మరియు ఎగువ సభ కోసం ప్రత్యేక ఛాంబర్లో 300 మంది సభ్యులు ఉండేలా కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ విస్టా ప్రాంతాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ఈ నూతన పార్లమెంటు భవనాన్ని అత్యాధునిక, సంప్రదాయ భారతీయ వాస్తు కళా నైపుణ్యంతో నిర్మించినట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. సమకాలిక సౌందర్య, కళా వైభవం, భారత దేశ చరిత్ర, సంస్కృతుల మేళవింపు కనిపిస్తోంది. భారత దేశ సుసంపన్న కళా వారసత్వాన్ని గుర్తు చేస్తూ అలంకృత శిల్పాలు, నమూనాలు ఈ భవనం వెలుపల కనిపిస్తున్నాయి. ఇక లోక్సభ స్పీకర్ కుర్చీ కుడి పక్కన పెట్టే సెంగోల్ అనే రాజదండాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో పాటు సెంగోల్ రూపకర్తలు సైతం హాజరుకానున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా మరియు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ప్రసంగిస్తారు. అనంతరం పార్లమెంట్ నిర్మాణం సమయంలోని అనేక ఘట్టాలతో రూపొందించిన వీడియోలను ప్రదర్శించనున్నారు. ఇక ఇదిలా ఉండగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ, డీఎంకే సహా 20 ప్రతిపక్షాలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. నూతన పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రారంభింపజేయకపోవడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని ఆరోపిస్తూ విపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. అయితే ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష టీడీపీలు హాజరవుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. అలాగే వీటితో పాటు బీజేడీ, ఎస్ఏడీ తదితర పార్టీలతో సహా అధికార కూటమి పక్షాలు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE