భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్దమైంది. రేపు (సోమవారం, మే 28, 2023) ఉదయం 10:42 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (జీఎస్ఎల్వీ-ఎఫ్12/ఎన్వీఎస్-01) రాకెట్ను ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి ఇది నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మేరకు ఈరోజు (ఆదివారం) ఉదయం 7:12 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. అంతకుముందు శనివారం లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో రాకెట్ లోని అన్ని దశలకు తుది విడత పరీక్షలు పూర్తి చేశారు. కాగా ఈ ఎన్వీఎస్-01 ఉపగ్రహ ప్రయోగం భారతదేశ నావిగేషన్ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో మరియు నావిక్ వ్యవస్థను బలోపేతం చేయడంలో దోహదపడనుందని ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. శాటిలైట్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో అమర్చడం ద్వారా ఇస్రో నావిగేషన్ సామర్థ్యాలను పెంపొందించడం ఈ మిషన్ యొక్క లక్ష్యం అని పేర్కొంది.
కాగా ఈ జీఎస్ఎల్వీ-ఎఫ్12 ఉపగ్రహం ఇండియన్ కాన్స్టెలేషన్ సేవలతో నావిగేషన్ కోసం వినియోగిస్తున్న రెండవ తరం ఉపగ్రహాలలో మొదటిది. ఈ ఉపగ్రహం బరువు దాదాపు 2,232 కిలోలు కాగా.. ఖచ్చితమైన కక్ష్య-ఎగువ ప్రక్రియలను అనుమతించే స్వదేశీ అణు గడియారాన్ని కలిగి ఉంటుంది. భారత ప్రాంతానికి నావిగేషనల్ సేవలను అందించే మొత్తం ఏడు ఉపగ్రహాల సమూహంలో ఇది ఒకటి. ఈ ఉపగ్రహం అందించే సేవలను విస్తృతం చేయడానికి ప్రత్యేకంగా ఎల్1 బ్యాండ్ సిగ్నల్లను పొందుపరిచారు. ఇక ఈ ఉపగ్రహం సుమారు 12 సంవత్సరాల పాటు తన కక్ష్యలో పరిభ్రమిస్తూ సేవలు అందించనుంది. ఈ క్రమంలో ఇది దాదాపు 36,000 కిలోమీటర్ల అపోజీతో జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టబడుతుంది. అలాగే దాని సొంత ప్రొపల్షన్ సిస్టమ్ను ఉపయోగించి దాని చివరి భూస్థిర కక్ష్యను చేరుకుంటుంది. కాగా ఇప్పటివరకు తమ సొంత నావిగేషన్ సిస్టమ్లను కలిగి ఉన్న దేశాలు అమెరికా, రష్యా మరియు చైనా మాత్రమే కావడం గమనార్హం. తాజా ప్రయోగంతో భారత్ కూడా ఆ దేశాల సరసన చేరనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE