భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు (ఆగస్టు 11, గురువారం) రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జగదీప్ ధన్కర్ చేత ప్రమాణం చేయించారు. దేవుడి సాక్షిగా హిందీలో జగదీప్ ధన్కర్ ప్రమాణం చేశారు. జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాజ్యసభ, లోక్సభ ఎంపీలు, పలు శాఖల ఉన్నతాధికారులు, జగదీప్ ధన్కర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఇక గురువారం ఉదయం ముందుగా జగదీప్ ధన్కర్ ఢిల్లీలోని రాజ్ఘాట్కు చేరుకుని జాతిపిత మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రపతి భవన్ కు చేరుకొని ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టు 6న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన జగదీప్ ధన్కర్, తన ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాపై 346 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. పోలైన 725 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో 528 ఓట్లు జగదీప్ ధన్కర్ కు రాగా, విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. దీంతో భారతదేశ నూతన ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ఎన్నిక ఖాయమైంది. ఇప్పటివరకు భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న ఎం.వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10, 2022తో ముగియడంతో, నేడు నూతన ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేసి, పదవీ బాధ్యతలు స్వీకరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY