జమ్ము కశ్మీర్లో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బందితో ప్రయాణిస్తున్న వాహనం ఒకటి ప్రమాదానికి గురైంది. పహాల్గాం వద్ద బస్సు అదుపుతప్పి పైనుంచి లోయలో పడిపోయింది. ఇక ఈ ప్రమాదంలో ఆరుగురు ఐటీబీపీ సిబ్బంది అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు అధికారులు వెల్లడించారు. కాగా వీరంతా అమర్నాథ్ యాత్రికుల భద్రత కోసం వెళ్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. కాగా మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అమర్నాథ్ యాత్ర విధుల్లో పాల్గొనడం కోసం ఐటీబీపీకి చెందిన 39 మంది సిబ్బందితో కూడిన బస్సు చందన్వారీ నుంచి పహల్గాంకు పయనమైంది. ఈ క్రమంలో పహల్గాం ఫ్రిస్లాన్ రోడ్డు వద్దకు చేరుకోగానే బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి క్రిందనున్న లోయలోకి పడిపోయింది. ఆ సమయంలో బస్సులో 37 మంది ఐటీబీపీ సిబ్బంది, మరో ఇద్దరు జమ్ము పోలీసులు ఉన్నారని తెలిపారు. ఇక ఈ ఘటనలో ఆరుగురు ఐటీబీపీ సిబ్బంది మరణించగా, మిగిలిన వారు గాయపడ్డారని, వారిని హుటాహుటిన శ్రీనగర్ ఆస్పత్రికి తరలించినట్లు ప్రకటించారు. అయితే గాయపడ్డ వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY