అనకాపల్లిలోని అచ్యుతాపురం స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్)లో జపాన్కు చెందిన యోకోహామా కంపెనీకి చెందిన ఏటీసీ టైర్ల యూనిట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. అనంతరం సుమారు రూ. 2,000 కోట్లతో నిర్మించిన టైర్ల తయారీ ప్లాంట్ను సీఎం జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కంపెనీ పనితీరుని, ఉత్పత్తి ప్రణాళికలను యోకోహామా ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. కాగా ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రులు బూడి ముత్యాల నాయుడు, రాజన్న దొర, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్, అనకాపల్లి ఎంపి సత్యవతితో పాటు ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, జిల్లా కలెక్టర్ రవి సుభాష్, డిఐజి హరికృష్ణ, ఎస్పీ గౌతమీ శాలి తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కలిగిన యోకోహామా కంపెనీ రూ. 2,000 కోట్ల భారీ పెట్టుబడితో మన రాష్ట్రంలో ఏటీసీ టైర్ల యూనిట్ను నెలకొల్పడం ఆహ్వానించదగ్గ పరిణామమని, దీనిద్వారా దాదాపు 5 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ నంబర్ వన్గా ఉందని తెలిపిన ఆయన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కేంద్రం నుంచి మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నామని గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే అన్ని పరిశ్రమలకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా యోకోహామా రబ్బర్ గ్రూప్ ఇక్కడ నుంచి టైర్లను తయారు చేస్తుంది. అలాగే వ్యవసాయం మరియు ఇతర పరికరాలలో ఉపయోగించే విధంగా వీటిని తయారు చేయనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY