జస్టిస్ ఎన్వీ రమణ ఏప్రిల్ 24, శనివారం నాడు సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ ఎన్వీ రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన ఆగస్టు 26, 2022 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పలువురు ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారమానంతరం వారంతా జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ముందుగా సీజేఐగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే తన తరువాత అనుభవజ్ఞుడు, సీనియర్ అయిన ఎన్వీ రమణను పేరును తదుపరి చీఫ్ జస్టిస్ గా ప్రతిపాదిస్తూ కేంద్రానికి లేఖ రాసారు. ఈ క్రమంలో ఆ ప్రతిపాదనను కేంద్రం పరిశీలించిన అనంతరం రాష్ట్రపతి కార్యాలయానికి చేరింది. అనంతరం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ ప్రతిపాదనలను ఆమోదించి, సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జస్టిస్ ఎన్వీ రమణ 1957 ఆగస్ట్ 27న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో జన్మించారు. 1983లో ఆయన న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలు పెట్టారు. జూన్ 2000 లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అలాగే ఫిబ్రవరి 2014లో పదోన్నతి భాగంగా సుప్రీంకోర్టుకు వెళ్లేముందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఇంతకాలం సీజేఐగా పనిచేసిన జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే ఏప్రిల్ 23, శుక్రవారం నాడు రిటైర్ కావడంతో, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ