దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై చర్చించేందుకు అన్ని పార్టీల పార్లమెంటు ఫ్లోర్ లీడర్లతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ఏప్రిల్ 14న లాక్డౌన్ ఎత్తివేయడం సాధ్యమయ్యేలా లేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. లాక్డౌన్ ఎత్తివేసే పరిస్థితులు కనిపించడం లేదు, కరోనా వ్యాప్తి తర్వాత పరిస్థితులు మునుపటిలా లేవు. పరిస్థితి కరోనాకు ముందు, కరోనాకు తరువాత అన్నట్లుగా మారుతుందని, ఇకపై దేశంలో సామాజిక, వ్యక్తిగత ప్రవర్తనలో మార్పులు రావాల్సి ఉందని మోదీ పేర్కొన్నట్టు సమాచారం. లాక్డౌన్ అంశంపై అందరి సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని, త్వరలోనే ముఖ్యమంత్రులతో మరోసారి చర్చిస్తానని మోదీ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ గులాం నబీ ఆజాద్, శివసేన నుంచి సంజయ్ రౌత్, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఎస్సీ మిశ్రా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ్, బిజు జనతాదళ్ నుంచి పినాకీ మిశ్రా, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, సమాజ్వాదీ పార్టీ నుంచి రామ్ గోపాల్ యాదవ్, శిరోమణి అకాలీదళ్ నుంచి సుఖ్బీర్ సింగ్ బారల్, జనతాదళ్ నుంచి రాజీవ్ రంజన్ సింగ్ సహా ఇతర పార్టీల పార్లమెంటు ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు, లాక్డౌన్ వలన ఉత్పన్నమయ్యే ఆర్ధిక నష్టాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను అఖిలపక్ష నాయకులకు వైద్య, ఆరోగ్యం, గృహ మరియు గ్రామీణాభివృద్ధి తో సహా వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు వివరించారు.