సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ యు.యు.లలిత్ శనివారం ఉదయం ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ యు.యు.లలిత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నవంబర్ 8, 2022 వరకు జస్టిస్ యు.యు.లలిత్ చీఫ్ జస్టిస్ పదవిలో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజ్జు సహా పలువురు కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పలువురు ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారమానంతరం వారంతా యు.యు.లలిత్కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ముందుగా సీజేఐగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ ఎన్వీ రమణ తన తరువాత అనుభవజ్ఞుడు, సీనియర్ అయిన జస్టిస్ యు.యు.లలిత్ పేరును సుప్రీంకోర్టు 49వ సీజేగా ఇటీవలే కేంద్రానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ప్రతిపాదనను కేంద్రం పరిశీలించిన అనంతరం రాష్ట్రపతి కార్యాలయానికి చేరింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ప్రతిపాదనలను ఆమోదించి, సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు.లలిత్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆగస్టు 26న జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఆగస్టు 27, శనివారం ఉదయం జస్టిస్ యు.యు.లలిత్ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు.
జస్టిస్ యు.యు.లలిత్ ఆగస్టు 2014లో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బార్ నుండి నియమితులయ్యారు. 1971లో 13వ సీజేఐగా పనిచేసిన జస్టిస్ ఎస్ఎం సిక్రి తర్వాత, బార్ నుండి నేరుగా సుప్రీంకోర్టుకు ఎలివేట్ చేయబడిన రెండవ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు.లలిత్ గుర్తింపు పొందారు. జస్టిస్ లలిత్ రెండు పర్యాయాలు సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యునిగా పనిచేశారు, అలాగే ఆయన కెరీర్లో అనేక మైలురాయి తీర్పులు ఉన్నాయి.
నవంబర్ 9, 1957న మహారాష్ట్రలోని షోలాపూర్లో జస్టిస్ లలిత్ జన్మించారు. జూన్, 1983లో మహారాష్ట్ర మరియు గోవా బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఆయన జనవరి, 1986లో తన ప్రాక్టీస్ ఢిల్లీకి మార్చడానికి ముందు డిసెంబర్, 1985 వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. ఆయన అక్టోబరు 1986 నుండి 1992 వరకు సోలి జె. సోరాబ్జీ ఛాంబర్లో పనిచేశారు మరియు జె.సొరాబ్జీ భారతదేశానికి అటోమీ జనరల్గా ఉన్న కాలంలో యూనియన్ ఆఫ్ ఇండియా తరపున న్యాయవాదుల ప్యానెల్లో ఉన్నారు. 1992 నుండి 2002 వరకు అడ్వకేట్ ఆన్ రికార్డ్గా ప్రాక్టీస్ చేశారు మరియు ఏప్రిల్ 2004లో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్గా నియమించబడ్డారు. అటవీ వ్యవహారాలు, వాహన కాలుష్యం, యమునా కాలుష్యం మొదలైన అనేక ముఖ్యమైన అంశాలలో ఆయన అమికస్ క్యూరీగా నియమించబడ్డారు. అలాగే అన్ని 2జీ వ్యవహారాల్లో విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐకి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కూడా జస్టిస్ యు.యు.లలిత్ బాధ్యతలు నిర్వర్తించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY