కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను బీజేపీలో చేరుతానన్న ఊహాగానాలకు తెరదించుతూ, కన్నడ ప్రముఖ నటుడు ‘కిచ్చా’ సుదీప్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదీప్ మాట్లాడుతూ.. తాను బీజేపీలో చేరడం లేదని, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేయబోవడం లేదని స్పష్టం చేశారు. అయితే సీఎం బొమ్మై కోసం ప్రచారం చేస్తానని, ఇంకా ఆయన కోరుకునే వారి తరపున కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు. తనకు సీఎం చిన్నప్పటి నుంచి తెలుసని, ఈరోజు ఆయన రాష్ట్ర నాయకుడు కావడం చాలా సంతోషంగా ఉందని, ఆయనను తాను ‘మామ’ అని పిలుస్తానని చెప్పారు. ఇక తాను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారిలో సీఎం బొమ్మై కూడా ఉన్నారని, అందుకే ఇప్పుడు ఆయనకు అవసరమైన సమయంలో ప్రచారం చేయడం తన కర్తవ్యం అని నటుడు సుదీప్ పేర్కొన్నారు.
అయితే తాను రాష్ట్రమంతటా ప్రచారం చేయడం సాధ్యం కాదని, నా మద్దతు అవసరమని సీఎం బొమ్మై భావిస్తే కొందరికి ప్రచారం చేస్తానని కిచ్చా సుదీప్ స్పష్టం చేశారు. కాగా తన జీవితంలో కష్ట సమయాల్లో ఇతర పార్టీల నుండి ఎవరైనా నాకు సహాయం చేసి ఉంటే, తాను వారి కోసం కూడా ప్రచారం చేస్తానని సుదీప్ వివరించారు. ఇక మీడియాతో జరిగిన ఇంటరాక్షన్లో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా దీనిపై స్పందించారు. తనకు మరియు నటుడు సుదీప్ కు మధ్య ఉన్న సంబంధాన్ని గౌరవించాలని ప్రజలను అభ్యర్థించారు. సుదీప్ ఏ పార్టీలో చేరట్లేదని, అయితే ప్రస్తుత ఎన్నికల్లో తనకు మద్దతు ఇస్తున్నారని వెల్లడించారు. సుదీప్ పార్టీలో చేరకపోయినా, మా కోసం ప్రచారం చేయాలని కోరానని, దానికి అతను అంగీకరించాడని, నాతో పాటు పార్టీ తరపున ప్రచారం చేస్తారని తెలిపారు. ఇక బీజేపీ అభ్యర్థులకు సుదీప్ మద్దతు ఇవ్వనుండటం పార్టీకి గొప్ప బలాన్నిచ్చిందని సీఎం బొమ్మై తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE