తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన పదో తరగతి (ఎస్ఎస్సీ) ప్రశ్నాపత్రం లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్కు హనుమకొండ జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతో పాటు మరో ముగ్గురు నిందితులు బూరం ప్రశాంత్, గుండెబోయిన మహేశ్, మౌటం శివగణేష్లకు కూడా కోర్టు 2 వారాల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బండి సంజయ్తో పాటు వారిని కూడా పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు. కాగా రిమాండ్ ఆదేశాల మేరకు బండి సంజయ్ను ఖమ్మం జైలులో ఉంచాల్సి ఉంది. అయితే జైల్లో బండి సంజయ్ ప్రాణాలకు ముప్పు ఉందని అతని లాయర్లు వాదించడంతో కరీంనగర్ జైలుకు తరలించడానికి న్యాయమూర్తి రాపోలు అనిత ఆమోదించారు. ఈ క్రమంలో పోలీసులు సంజయ్ను వరంగల్ నుంచి బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో కరీంనగర్ జైలుకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక ఈ కేసులో పోలీసులు.. ఏ1గా బండి సంజయ్ కుమార్, ఏ2గా బూరం ప్రశాంత్, ఏ3గా గుండెబోయిన మహేశ్, ఏ4గా ఒక మైనర్ బాలుడు, ఏ5గా మౌటం శివగణేశ్లను పేర్కొన్నారు. అయితే ఇదే కేసులో మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. వీరిలో.. ఏ6 పోగు సుభాష్, ఏ7 మైనర్, ఏ8 మైనర్, ఏ9 పెరుమాండ్ల శ్రామిక్ (నాని), ఏ10 పోతబోయిన వర్షిత్ తదితరులు ఉన్నారు. వీరి జాడ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక అంతకుముందు బండి సంజయ్ అరెస్టుపై సీపీ రంగనాథ్ బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించి పలు కీలక విషయాలు వెల్లడించారు. కమలపూర్లో పేపర్ లీకేజ్లపై బండి సంజయ్ ప్రెస్ నోట్ ఇచ్చారని, ఈ వ్యవహారానికి ప్రభుత్వమే బాధ్యతంటూ విద్యార్థులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని చెప్పారు. ఇక బండి సంజయ్ చర్యల వల్ల పరీక్షలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలోపెట్టుకుని, పరీక్షలకు విఘాతం కలగకుండా ఉండేందుకే బండి సంజయ్ని ప్రివెన్షన్ కింద అరెస్ట్ చేశామని ఆయన స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE