కర్నాటకలో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. సాధారణంగానే ఎన్నికల ముందు రాజకీయ పార్టీలలో చిత్ర విచిత్రాలు చూస్తాము. సాధ్యం కాదనుకున్న స్నేహాలు, వైరాలు కూడా.. కొత్త కండువా కప్పుకోవడానికి, పాత గూటికి పరిగెట్టడానికి, దోస్త్ మేరా దోస్త్ అంటూ పొత్తు రాజకీయాలకు రెడీ అయిపోతుంటాయి.
ఇప్పుడు కర్ణాటకలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ నువ్వా, నేనా అని అనుకున్న రెండు పార్టీలు అనూహ్యంగా త్వరలో పొత్తు పెట్టుకోనున్నాయి.అవును.. 2024 లోక్సభ ఎన్నికల కోసం జేడీఎస్, బీజేపీలు పొత్తుకు రెడీ అయిపోయాయి. దీనికోసం జరగాల్సిన చర్చలు కూడా దాదాపుగా ముగిసిపోయాయట.
ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా రెండు పార్టీలు పొత్తుల రాజకీయం మొదలెట్టేసాయి. గతంలో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీజేపీ, జేడీఎస్లు ఇప్పుడు ఒక్కటి కాబోతున్నాయి. గతంలో కుమార స్వామి సీఎం పీఠం ఎక్కగానే ఓర్వలేకపోయిన బీజేపీ.. తన రాజకీయ ఎత్తుగడలతో మొదలెట్టిన రియల్ పాలిటిక్స్.. చివరకు కుమారస్వామి దిగిపోయేలా చేసింది. దీంతో కుమార స్వామి ప్రభుత్వం కూలి కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. కానీ చివరకు కాంగ్రెస్కు కామన్ శతృవులుగా ఉన్న ఈ రెండు పార్టీలు వచ్చే లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి పొత్తు రాజకీయాలను ఫాలో అయిపోయాయి.
జేడీఎస్, బీజేపీల అగ్రనేతలు దీనిపై చర్చలు జరుపగా..ఈ విషయాన్ని కర్నాటక మాజీ సీఎం.. బీజేపీ నేత అయిన యడియూరప్ప స్పష్టం చేశారు. అంతేకాదు ఈ మధ్యనే జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి పొత్తుకు సంబంధించిన అంశాలపై చర్చించారట. అయితే రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు అనేదానిపై ఈ రెండు పార్టీలకు స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు బీజేపీ నేత యడియూరప్ప చెప్పిన ప్రకారం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జేడీఎస్కు నాలుగు సీట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ మాత్రం..తమకు ఐదు సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని మాండ్య, హసన్, తూమకూరు, చిక్బళ్లాపూర్, బెంగళూరు రూరల్ స్థానాలను జేడీఎస్కు ఇవ్వాలని దేవెగౌడ అడిగారు. బీజేపీ పెద్దలతో మాట్లాడటానికి ముందే.. తమ పార్టీ అగ్రనేతలతో సుదీర్ఘ చర్చలు జరిపిన దేవెగౌడ.. పొత్తు ప్రతిపాదనను బీజేపీ ముందు ఉంచారట.
లోక్సభ ఎన్నికల్లో జేడీఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని దేవెగౌడ చెప్పిన నెలరోజులకే..మాట మార్చి బీజేపీ ముందు పొత్త ప్రతిపాదన తీసుకురావడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరని.. కేవలం పార్టీలు, వ్యక్తుల అవసరాలు మాత్రమే ఉంటాయనేది జేడీఎస్, బీజేపీ పొత్తు ఎపిసోడ్తో మరోసారి తేలిపోయిందని సెటైర్లు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE