కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కీలక నేత, సికింద్రాబాద్ ఎంపీ జీ.కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కేంద్ర పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖలను కిషన్ రెడ్డికి కేటాయించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఢిల్లీలో కేంద్ర కేబినెట్ మంత్రిగా ఈ మూడు శాఖలు బాధ్యతలను కిషన్ రెడ్డి స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు హాజరై కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం ట్విట్టర్ వేదికగా కిషన్ రెడ్డి స్పందిస్తూ, “నాపై విశ్వాసం ఉంచిన ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ప్రధానమంత్రి అంచనాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లేందుకు శక్తివంచనలేకుండా ప్రయత్నిస్తాను. నాకు మార్గదర్శనం చేస్తూ, మద్దతుగా నిలిచిన అమిత్ షాకు ధన్యవాదములు. వారి శిక్షణలో క్రమశిక్షణతోపాటు చాలా విషయాలు తెలుసుకున్నాను, వారికి కృతజ్ఞుడనై ఉంటాను. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో తోపాటు ఇతర బీజేపీ సీనియర్ నేతలకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నాను. నవభారత నిర్మాణం కోసం ప్రధాని మోదీ స్వప్నం సాకారాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లడం, తెలంగాణ అమరవీరుల ఆశలు, ఆకాంక్షలకు, అనుగుణంగా వారి కలలు సాకారమయ్యేలా తెలంగాణ అభివృద్ధి కోసం చురుగ్గా పనిచేయడం అనే రెండు వ్యూహాలు ప్రస్తుతానికి నా ముందున్నాయి. నన్ను ఆదరించి పార్లమెంట్ సభ్యునిగా నన్ను ఆశీర్వదించిన సికింద్రాబాద్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్ మంత్రి పదవి దక్కించుకున్న తొలి నాయకుడిగా కిషన్ రెడ్డి గుర్తింపు పొందారు. ముందుగా ప్రధాని మోదీ నేతృత్వంలో 2019 లో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలో ఏర్పాటుచేసిన కేబినెట్ లో కిషన్ రెడ్డి కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజా విస్తరణలో భాగంగా ఆయనకు పదోన్నతి ఇస్తూ కేబినెట్ మంత్రి హోదా కల్పించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ