రష్యా ఆర్డీఐఎఫ్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ మూడో బ్యాచ్ మంగళవారం నాడు భారత్ కు చేరుకుంది. రష్యా నుంచి ప్రత్యేక చార్టర్డ్ ఫ్రైటర్ RU-9450 విమానం ద్వారా సుమారు 30 లక్షల స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ డోసులు హైదరాబాద్ కు చేరుకున్నాయి. కరోనా వ్యాక్సిన్లకు సంబంధించి ఇప్పటివరకు భారత్ కు చేరుకున్న అతిపెద్ద దిగుమతి (56.6 ఎంటీ) ఇదేనని జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో పేర్కొంది. మంగళవారం తెల్లవారుజామున 3.43 గంటల ప్రాంతంలో ఈ వ్యాక్సిన్ డోసులు విమానాశ్రయానికి చేరుకోగా 90 నిమిషాల్లో దిగుమతి ప్రక్రియ పూర్తిచేసి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కు తరలించారు. కాగా మే 1న మొదటి బ్యాచ్ కింద ఇప్పటికే 1.5 లక్షల డోసులు, మే 16 న రెండో బ్యాచ్ కింద మరో 60 వేల డోసులు హైదరాబాద్ కు చేరిన సంగతి తెలిసిందే.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా కోవాక్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ల పంపిణీ ఇప్పటికే జరుగుతుండగా, స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కూడా డీసీజీఐ అనుమతి ఇచ్చింది. విదేశంలో తయారై దేశంలో వినియోగించబోయే తోలి కరోనా వ్యాక్సిన్ గా స్పుత్నిక్-వీ నిలిచింది. ముందుగా స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ కు సంబంధించి దేశంలో ఉత్పత్తి, అమ్మకాలపై రష్యా ఆర్డీఐఎఫ్ తో హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్ ఒక్కో డోసుకు ప్రస్తుతం రూ.948+ 5 శాతం జీఎస్టీతో కలిపి ధర రూ.995.40 గా నిర్ణయించినట్టు ఇటీవలే డాక్టర్ రెడ్డీస్ సంస్థ ప్రకటించింది. అలాగే దేశంలో స్పుత్నిక్-వీ సాఫ్ట్ లాంచ్లో భాగంగా మొదటి డోసు పంపిణీ కార్యక్రమాన్ని కూడా డాక్టర్ రెడ్డీస్ సంస్థ మే 14న హైదరాబాద్ లో ప్రారంభించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ