ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A) లోగో రెడీ అయిపోయింది. దీనిని వచ్చే సమావేశంలోనే విడుదల చేసేందుకు విపక్ష కూటమి నేతలు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు.ముంబైలో జరగబోయే కూటమి సమావేశంలో ఈ ‘లోగో’ను ఆవిష్కరించేందుకు చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో విపక్ష కూటమి ముంబైలో సమావేశం కానుంది. ఇప్పటికే కూటమి రెండు సమావేశాలు అనుకున్న విధంగానే ముగిసాయి. మొదటి సమావేశం జనతాదళ్ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్, రాష్ట్రీయ జనతా దళ్ నేత, బిహార్ డెప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సంయుక్తంగా బిహార్ రాజధాని నగరమయిన పాట్నాలో విపక్ష కూటమి తొలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే.. కాంగ్రెస్ సారథ్యంలో రెండో సమావేశం బెంగళూరులో జరిగింది. బెంగళూరు సమావేశంలోనే కూటమి I.N.D.I.A గా నామకరణం చేసి సగర్వంగా ప్రకటించారు. అయితే ఆ సారి ముంబైలో జరగనున్న మూడో సమావేశానికి శివసేన వర్గం అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆతిథ్యమిస్తున్నారు.
ప్రతి సమావేశానికి కూడా విపక్ష కూటమిలో భాగస్వామ్య పార్టీల సంఖ్యా బలం పెరుగుతూనే వస్తోంది. పాట్నా సమావేశంలో 17 పార్టీలకు చెందిన 32 మంది హాజరవగా.. బెంగళూరు సమావేశంలో ఆ సంఖ్య పెరిగి 26 పార్టీలు పాల్గొన్నాయి. ఇక ఇప్పుడు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగే కూటమి మూడో సమావేశంలో 26 కంటే ఎక్కువ రాజకీయ పార్టీలకు చెందినవారు.. సుమారుగా 80 మంది నేతలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 26 పార్టీలు కూటమిలో భాగంగా ఉన్నాయి. ముంబైలో రెండ్రోజుల పాటు జరిగే మూడో సమావేశంలో మరి కొన్ని పార్టీలు కూటమిలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సమావేశంలో రెండో రోజు అయిన సెప్టెంబర్ 1న.. ఆ రోజు మొత్తం చర్చలు జరగనున్నాయి. అయితే అదే రోజు ‘లోగో’ ఆవిష్కరణతోనే చర్చలను ప్రారంభించనున్నారు. ఇక ముందు రోజు.. అంటే ఆగస్టు 31న ముంబై సబర్బన్లో ఉన్న గ్రాండ్ హయత్ హోటల్లో కూటమి నేతలకు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే అతిథులకు విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు.. కూటమిలోని వివిధ పార్టీల నేతలు ఆగస్టు 31 సాయంత్రం 6.00 గంటల లోపే ముంబైకి చేరుకుంటారు.
నిజానికి కూటమి రెండో సమావేశం తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక సహా దేశ వ్యాప్తంగా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఢిల్లీ ఆర్డినెన్స్పై ఓటింగ్, అవిశ్వాస తీర్మానంపై.. ప్రతిపక్షాల ఐక్యతకు పరీక్ష పెట్టేలా చర్చలు జరిగాయి. అటే ఐటీ, ఈడీ, సీబీఐ కేసులతో విపక్ష నేతలను బెదిరిస్తూ, ఒత్తిళ్లకు గురి చేస్తున్నారంటూ కూటమి నేతలంతా ఇప్పటికే ఆరోపిస్తున్నారు. అయితే ఇలాంటి ఏ చర్యలూ తమ ఐక్యతను దెబ్బతీయలేవని అంటున్నారు విపక్ష నేతలు. మరి ముంబై సమావేశంలో కూటమి ‘లోగో’ ఆవిష్కరణతో పాటు.. తమ కూటమి తరపున ఎలాంటి సందేశం ఇస్తుందో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE