పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చ్ 2న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన ఘర్షణల పై చర్చ జరపాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ రోజు కూడా ఢిల్లీ అల్లర్లపై చర్చించాలని విపక్ష సభ్యుల నినాదాలు చేయడంతో లోక్సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభకు హాజరై ఢిల్లీ ఘటనలపై చర్చించాలని వారు స్పీకర్ను కోరారు. స్పీకర్ ఓం బిర్లా ఎంత విజ్ఞప్తి చేసినా కూడా విపక్షాల సభ్యులు వినిపించుకోకుండా చర్చకు పట్టుబట్టడంతో సభను మార్చ్ 11, బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు రాజ్యసభలో కూడా ఢిల్లీ అల్లర్లపై చర్చించాలని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళ పరిస్థితుల ఏర్పడ్డాయి. దీంతో సభను మార్చ్ 11వ తేదీ వరకూ వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు.