తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 6, శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా శాసనసభ, శాసనమండలిలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 20వరకు కొనసాగించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
అలాగే మార్చ్ 9, 10,15 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు. మార్చ్ 7న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించనున్నారు. మార్చ్ 8న 2020-21 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశపెడతారు. ఇక 11, 12వ తేదీల్లో బడ్జెట్పై సాధారణ చర్చ చేపడతారు. మిగతా రోజుల్లో బడ్జెట్ పద్దులపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. మార్చ్ 20న ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చించి బడ్జెట్ సమావేశాలును ముగిస్తారు. ఈసారి ఆర్థిక మంత్రి హోదాలో హరీష్ రావు మొదటిసారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు.
[subscribe]