మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభం అంచున నిలుచుంది. కొన్ని రోజుల క్రితం 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడంతో మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి, వారిలో కొందరు వెనక్కి రావడంతో పరిస్థితులు సద్దుమణుగుతాయని భావించారు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ కనపడకుండా పోయి బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు. బెంగళూరు శివార్లలోని ఓ రిసార్ట్లో ఈ ఎమ్మెల్యేలంతా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 17 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన వారుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీపై సింధియా తిరుగుబాటు చేసే అవకాశమునట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం సింధియా ఫోన్ స్విచాఫ్ వస్తుందని, ఎవరికీ అందుబాటులో లేరని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు పార్టీలో అసంతృప్తులను బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి కమల్నాథ్ తన మంత్రివర్గాన్ని విస్తరించే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో 20 మంది మంత్రివర్గ సభ్యులు సోమవారం రాత్రి ముఖ్యమంత్రి కమల్నాథ్ కు తమ రాజీనామాలను సమర్పించగా, ఆయన వాటిని ఆమోదించారు.
మరోవైపు మార్చ్ 10, మంగళవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసి ప్రధాని మోదీ నివాసానికి సింధియా వెళ్లారు. ఈ సమావేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కీలక పరిణామాలపై వారు చర్చించినట్లుగా తెలుస్తుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో జ్యోతిరాదిత్య సింధియాపై పలువురు కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం దక్కలేదనే భావనతోనే సింధియా ఇలా తిరుగుబాటుకు దిగారని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం మధ్యప్రదేశ్ లోని పరిస్థితులపై సమీక్ష జరుపుతుంది. ఈ క్రమంలో సింధియా తనను కలవడానికి ఢిల్లీకి వచ్చినా కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని సమాచారం.