ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న భారత రెజ్లర్లకు అనుకోని ప్రముఖ వ్యక్తి నుంచి అనూహ్య మద్దతు లభించింది. జంతర్ మంతర్ వేదికగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్పై లైంగిక ఆరోపణలు చేస్తూ భారత రెజ్లర్లు నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా, భారత ఒలింపిక్ సమాఖ్య (ఐఓఏ) ప్రెసిడెంట్ పీటీ ఉష తదితరులు ఇప్పటికే వారికి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ బహిరంగ మద్దతు తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు. శనివారం రాజస్థాన్లోని భిల్వారాలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న యోగా శిబిరంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాబా రామ్దేవ్ మాట్లాడుతూ.. ‘రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్పై దేశంలోని రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసనకు కూర్చోవడం చాలా సిగ్గుచేటు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత రెజ్లర్లు 34 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఇది అత్యంత బాధాకరమైన విషయం. వారి సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి వారిని వెంటనే అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టాలి. అతను తల్లులు, కుమార్తెలు, సోదరీమణుల గురించి ప్రతిరోజూ అర్ధంలేని మాటలు మాట్లాడుతున్నాడు. ఇది చాలా ఖండించదగిన దుష్ట చర్య. నేను స్టేట్మెంట్ మాత్రమే ఇవ్వగలను. కానీ అరెస్ట్ చేసే అధికారం నాకు లేదు. అయితే నేను దేశానికి సంబంధించిన అన్ని రాజకీయ ప్రశ్నలకు సమాధానమివ్వగలను. ఎందుకంటే నేను మానసికంగా లేదా మేధో వికలాంగుడిని కాదు, నాకు దేశం పట్ల విజన్ ఉంది’ అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE