మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. దేశంలోని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులలో ఒకరు. దశాబ్దాలుగా పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేతగా ఆయనకి గుర్తింపు ఉంది. అలాగే, మధ్యప్రదేశ్ రాజకీయాలలో శివరాజ్ సింగ్ లేని బీజేపీని ఊహించుకోవడం కష్టం. బీజేపీలో ప్రధాని మోదీ కూడా గౌరవించే సీనియర్ నాయకుల్లో చౌహాన్ ఒకరు. అయితే ఇప్పుడు ఆయన ఒక సరికొత్త రికార్డు సృష్టించారు. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులలో ఎక్కువ రోజులు పాలన సాగించిన ముఖ్యమంత్రిగా.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నిలిచారు. శివరాజ్ సింగ్ గురువారం నాడు ఛత్తీస్గఢ్కు చెందిన రమణ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. నిన్నటి(గురువారం)తో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిలో శివరాజ్ సింగ్ 15 ఏళ్ల 11 రోజులు పూర్తి చేసుకున్నారు.
దీంతో గతంలో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్సింగ్ నెలకొల్పిన 15 ఏళ్ల 10 రోజుల రికార్డును అధిగమించిన శివరాజ్సింగ్ చౌహాన్ బీజేపీ ముఖ్యమంత్రులందరిలో ఎక్కువ కాలం పనిచేసిన సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, చౌహాన్ తొలిసారిగా నవంబర్ 2005లో బాబూలాల్ గౌర్ స్థానంలో ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటినుంచి 2018 వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. అనంతరం జరిగిన ఎన్నికలలో ఓటమి చెందారు. డిసెంబర్ 2018 నుండి మార్చి 2020 వరకు కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల అనంతరం మళ్ళీ శివరాజ్ సింగ్ ముఖ్యమంత్రి పీఠమెక్కారు. మధ్యప్రదేశ్కు ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత కూడా చౌహాన్ దే కావడం గమనార్హం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ