ప్రముఖ దేశీయ వ్యాపార దిగ్గజం టాటా స్టీల్కు చెందిన జంషెడ్పూర్ ఫ్యాక్టరీలో శనివారం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కోక్ ప్లాంట్లో మంటలు చెలరేగగా, ముగ్గురు ఉద్యోగులు గాయపడినట్లు ఫ్యాక్టరీ ఓక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు శనివారం టాటా స్టీల్ ప్లాంట్లోని గ్యాస్ పైప్లైన్ పేలుడు కారణంగా ముగ్గురికి గాయాలయ్యాయని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. స్టాండర్డ్ సేఫ్టీ ప్రోటోకాల్ ప్రకారం, ఈ సంఘటన గురించి వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేశామని, పేలుడుకు గల కారణాన్ని నిర్ధారించడానికి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అయితే మంటలను ఆర్పేందుకు పలు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.
శనివారం ఉదయం 10.20 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించిందని, గాయపడిన ఉద్యోగులను టాటా మెయిన్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించామని తెలిపారు. కాగా ప్రమాదం ఉదయమే సంభవించినా బయటకు తెలియటానికి సమయం పట్టింది. దీనిపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్వీట్ చేస్తూ.. “టాటా స్టీల్ ప్లాంట్లో పేలుడు జరిగినట్లు మాకు సమాచారం అందింది. జిల్లా యంత్రాంగం టాటా స్టీల్ యాజమాన్యం సమన్వయంతో గాయపడిన వారికి సత్వర చికిత్స కోసం చర్యలు తీసుకుంటోంది” అని తెలిపారు. మరోవైపు దీనిపై జంషెడ్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బినిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఘటన వెనుక ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ