తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సీఎం ఎంకే స్టాలిన్ నేడు అసెంబ్లీలో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 60 నుండి 70 శాతం వరకు నెరవేర్చిందని అన్నారు. అలాగే ఇక ముందుకూడా ద్రవిడియన్ మోడల్ను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో మరో 5 కొత్త పథకాలను సీఎం స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అల్పాహార (బ్రేక్ ఫాస్ట్) పథకం ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. 1 నుండి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని పని దినాలలో ఉదయం పౌష్టికాహారంతో కూడిన టిఫిన్ అందించడం జరుగుతుందని, ముందుగా ఈ పథకం కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లు మరియు మారుమూల గ్రామాలలో అమలు చేయబడుతుందని తెలిపారు. ఈ పిల్లలలో పోషకాహార లోపాన్ని సరిచేయడానికి ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న విద్యార్థులకు వైద్య సహాయం మరియు పోషకాలు అందించబడతాయన్నారు.
అలాగే ఢిల్లీ-మోడల్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ తరహాలో రూ.150 కోట్లతో రాష్ట్రంలో కొన్ని హయ్యర్ సెకండరీ పాఠశాలలను అప్గ్రేడ్ చేస్తామని చెప్పారు. రూ.180 కోట్లతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో 708 అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఇక ఇప్పటికే అమలులో ఉన్న ‘చీఫ్ మినిస్టర్ ఇన్ యువర్ కాన్స్టిట్యూఎన్సీ’ పథకాన్ని మొత్తం 234 నియోజకవర్గాలకు విస్తరిస్తామని, స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపి ప్రజల ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక అవసరాలు, సమస్యలను తీర్చుతామని సీఎం స్టాలిన్ ప్రకటించారు. శనివారం ఉదయం ముందుగా సీఎం స్టాలిన్ డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై మరియు అతని తండ్రి కలైంజర్ కరుణానిధి స్మారకాలను సందర్శించారు. అనంతరం సీఎం స్టాలిన్ లోకల్ బస్సులో ప్రయాణించి, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు తీరును పరిశీలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ