ప్రధాని నరేంద్రమోడీ, మాజీ సీఎం కేసీఆర్ అంటేనే భగ్గుమంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారంలోకి రాకముందు.. సమయం దొరికినప్పుడల్లా వారిపై నిప్పులు చెరిగేవారు. సందర్భాన్ని బట్టి వారిపై సంచలన వ్యాఖ్యలు చేసేవారు. ఇటీవలే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం జరిగిన రెండు, మూడు రోజులకే మోడీపై మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ప్రధాని మోడీ అనే మెడిసిన్కు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని వ్యాఖ్యానించారు. మోడీపై చేసిన వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది.
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సోనియాగాంధీ, కాంగ్రెస్ దిగ్గజాలతో పాటు రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సభాప్రాంగణం మొత్తం దద్దరిళ్లిపోయింది. రేవంత్ వ్యాఖ్యలకు సోనియా గాంధీ కూడా చప్పట్లు కొట్టారు. ప్రతి మెడిసిన్కు ఒక ఎక్స్పైరీ తేదీ ఉంటుందన్న రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీ అనే మెడిసిన్కు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని వ్యాఖ్యానించారు. మళ్లీ భారత్లో మోడీ అనే మెడిసిన్ పని చేయదని చెప్పుకొచ్చారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ నేతల్లో కొత్త స్పూర్తిని నింపిందని అన్నారు. కర్ణాటకలో భారత్ జోడో యాత్ర స్పూర్తితోనే కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. కర్ణాటక తర్వాత తెలంగాణలో భారత్ జోడో యాత్ర ప్రవేశించిందని.. ఇక్కడ కూడా కాంగ్రెస్ విజయం సాధించిందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మహారాష్ట్రలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించిందన్న రేవంత్ రెడ్డి.. అక్కడ కూడా కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని చెప్పుకొచ్చారు. అక్కడే కాదు ఎర్రకోటపై కూడా కాంగ్రెస్ మూడు రంగుల జెండా ఎగరడం తథ్యమన్న రేవంత్ రెడ్డి.. దానిని ఎవరూ ఆపలేరని చెప్పుకొచ్చారు.
భారతీయ జనతా పార్టీ చెప్పే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే.. అదానీ, ప్రధాని ఇంజిన్ సర్కార్ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. లోక్సభలో రాహుల్ గాంధీ గొంతు విప్పడంతో.. అదానీ ఇంజిన్ ఆగిపోయి షెడ్కు వెళ్లిపోయిందని విమర్శించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో ఇప్పటికే బీజేపీ సగం కుదేలుమందని ఎద్దేవా చేశారు. త్వరలో రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నారని.. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు ఈ యాత్ర కొనసాగనుందని చెప్పారు. భారత్ న్యాయ యాత్రతో మోడీ ఇంజిన్ ఆగిపోవడం ఖాయమని అన్నారు. కేంద్రంలో బీజేపీ గద్దె దిగడం ఖాయమని.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ