మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం ఇంకా రగులుతూనే ఉంది. తమపై నమోదు చేసిన రెండో ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలన్న నవనీత్, రవి రాణాల పిటిషన్ను ముంబై హైకోర్టు నేడు కొట్టివేసింది. మహారాష్ట్ర ఎంపీ నవనీత్ రాణా, ఆమె ఎమ్మెల్యే భర్త రవి రాణాలను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసు అధికారిపై దాడి చేశారంటూ దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. కాగా ముంబయిలోని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రైవేట్ నివాసం, మాతోశ్రీ వెలుపల బహిరంగంగా హనుమాన్ చాలీసా పఠిస్తామని బెదిరించడంతో పోలీసులు ఈ దంపతులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పిటిషన్ను కొట్టివేస్తూ.. “ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క వ్యక్తిగత నివాసంలో లేదా బహిరంగ ప్రదేశంలో కూడా కొన్ని మతపరమైన శ్లోకాలను పఠిస్తామని ప్రకటించటం ఖచ్చితంగా మరొక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడమే” అని కోర్టు పేర్కొంది.
కాగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పార్టీ అధినేత రాజ్ థాకరే మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించాలని రాష్ట్రానికి అల్టిమేటం ఇవ్వడంతో రాష్ట్రంలో రాజకీయ వివాదం ఏర్పడింది. మే 3లోగా ఇలాంటి లౌడ్స్పీకర్లన్నింటినీ తొలగించకపోతే, ఆజాన్ను ఎదుర్కోవడానికి ఎంఎన్ఎస్ హనుమాన్ చాలీసా వాయిస్తుందని రాజ్ థాకరే హెచ్చరించారు. అయితే దీనికి కొనసాగింపుగా ఎంపీ దంపతులు ఏకంగా సీఎం ఇంటివద్దే ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించడంతో అది తీవ్రస్థాయికి చేరుకుంది. ఆదివారం నాడు ప్రధానమంత్రి మోదీ మహారాష్ట్ర సందర్శన నేపథ్యంలో ముంబై పోలీసులు వీరిని శనివారం అర్థరాత్రి అరెస్టు చేసి ఆదివారం బాంద్రా కోర్టు ముందు హాజరు పరిచారు. అనంతరం కోర్టు వారికి 14 రోజుల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో ఎంపీ నవనీత్ రాణాను ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించగా.. ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాను నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ