2024 జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. ఇటీవల జరిగిన జీ20 సదస్సు సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల సమయంలో.. ఈ విషయంపై బైడెన్తో ప్రధాని మోడీ మాట్లాడారని భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు.
వచ్చే ఏడాది జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ముఖ్య అతిథిగా హాజరవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానించారని… ఎరిక్ గార్సెట్టి ప్రకటించారు. సెప్టెంబర్ 8న జీ 20 సదస్సులో భాగంగా..రెండు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రధాని మోడీ.. జో బైడెన్ను ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు. అయితే అదే సమయంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ సభ్యులుగా ఉన్న క్వాడ్ సమావేశం జరిగే అవకాశం ఉందా అని మీడియా ప్రశ్నకు ఎరిక్ సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు.
దీంతో జనవరిలో ఈ సారి జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు జో బైడెన్..ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రతి ఏడాది రి పబ్లిక్ వేడుకలకు.. ప్రపంచ దేశాధినేతలను భారత్ ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తోంది.అలా ఈసారి మోడీ ఆహ్వానంతో బైడెన్ ..గణతంత్ర ఉత్సవాలకు అతిథిగా రావడానికి అంగీకరిస్తే రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన రెండో అమెరికా అధ్యక్షుడిగా నిలుస్తారు.
ఢిల్లీ వేదికగా సెప్టెంబర్లో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరయ్యారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత్ వచ్చిన బైడెన్.. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధాని మోడీ నివాసానికి వెళ్లగా… అక్కడ ఆయనకు మోడీ ఘన స్వాగతం పలికారు. తర్వాత ఇద్దరూ కలిసి రెండు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బైడెన్తో భేటీ ఫలప్రదంగా జరిగిందని.. భారత్, అమెరికా ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచే చాలా అంశాలపై చర్చించినట్లు ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా మోడీ ఆ మధ్య ఓ పోస్ట్ కూడా పెట్టారు.
ప్రధాని మోడీ, జో బైడెన్ మధ్య చర్చల తర్వాత అమెరికా, భారత్ మధ్య చాలా అంశాలపై..కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు కుదిరినట్లు శ్వేత సౌధం వెల్లడించింది. అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అండ్ భారత బయోటెక్నాలజీ విభాగం మధ్య కీలక ఒప్పందం కుదిరినట్లు తెలిపింది. అంతేకాదు బయోటెక్నాలజీ, బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఆవిష్కరణల్లో ఒకరితో మరొకరి సహకారంతో పాటు.. శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనలో కలిసి పనిచేసేందుకు రెండు దేశాల అధినేతలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వైట్ హౌస్ వివరించింది. అలాగే సైబర్ సెక్యూరిటీ, రవాణా వ్యవస్థ, గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో కూడా సహకారం కోసం రెండు దేశాల మధ్య.. ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.అయితే ఇలాంటి సమయంలో జో బైడెన్ రిపబ్లిక్ వేడుకలకు వస్తే.. రెండు దేశాల మధ్య అన్ని రకాల సంబంధాలు మరింత మెరుగుపడతాయని అంతా భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE