అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాన్ వణికిస్తోంది. క్రిస్మస్ వారాంతంలో ఒక్కసారిగా చుట్టుముట్టిన మంచు తుఫాన్ ధాటికి యునైటెడ్ స్టేట్స్లో జనజీవనం స్తంభించిపోయింది. గత కొన్నేళ్లలో ఇంతటి భారీ స్థాయిలో చలి పెరగడం ఇదే అని అధికారులు పేర్కొన్నారు. దీనిని ‘ఈ శతాబ్దపు మంచు తుఫాను’గా వారు అభివర్ణించారు. వెస్ట్రన్ న్యూయార్క్ లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్తు నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ మంచు తుఫాన్ ప్రభావం ‘బఫెలో’పై పడింది. అక్కడ చాలామంది మరణించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. సున్నా డిగ్రీల కన్నా తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రతల కారణంగా వాహనాలలో మరియు షెల్టర్స్ వద్ద మృతదేహాలు కనుగొనబడిన భయంకరమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో నెలకొన్నాయి.
అమెరికాలో తీవ్ర చలిగాలులతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 60మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. రోడ్లపై మీటర్ల మందాన పేరుకుపోయిన మంచుతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో మైనస్ 40 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అమెరికా వాతావరణ శాఖ ప్రకటించింది. తీవ్ర మంచు తుఫాన్ కారణంగా పలు చోట్ల విమానాలను రద్దు చేస్తున్నారు. ఇక మంగళవారం న్యూజెర్సీలోని అరిజోనాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు దంపతులు మంచు తుఫాన్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు భార్య మృతదేహం దొరకగా.. ఇంకా భర్త మృతదేహం ఆచూకీ లభించలేదు. ఈ మేరకు ఆంధ్రలోని వారి కుటుంబ సభ్యులకు అక్కడి అధికారులు సమాచారమిచ్చారు.
ఈ నేపథ్యంలో న్యూయార్క్-కెనడా మధ్య భూభాగంలో ప్రవహించే, ప్రపంచంలోనే అత్యంత ఎతైన నయాగరా జలపాతం కూడా గడ్డకట్టింది. దీనిపై నయాగరా పార్క్స్ వెబ్సైట్ ఇలా తెలిపింది.. ‘ఈ ఐకానిక్ జలపాతం ఎప్పుడూ పూర్తిగా గడ్డకట్టదు, అయితే ప్రత్యేకించి చల్లని ఉష్ణోగ్రతల సమయంలో, పొగమంచు మరియు స్ప్రే ప్రవహించే నీటి పైన మంచు పొరను ఏర్పరచడం ప్రారంభమవుతుంది, ఇది జలపాతం ఆగిపోయినట్లు కనిపిస్తుంది. అయినప్పటికీ, మంచు పలకల క్రింద నీరు ప్రవహిస్తూనే ఉంటుంది’ అని పేర్కొంది. కాగా నయాగరా ఫాల్స్ వద్ద ప్రతి సెకనుకు 3,160 టన్నుల నీరు జలపాతం మీదుగా ప్రవహిస్తుంది, అలాగే సెకనుకు 32 అడుగుల చొప్పున నీరు కిందకు పడుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY