భారత జాతీయ కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం గాంధీభవన్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టీపీసీసీ చీఫ్ ఎ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. పార్టీ ఆవిర్భావం నాటి పరిస్థితులు, ఈ సుదీర్ఘ ప్రయాణంలో పార్టీకి ఎదురైన సవాళ్లు, ఈ క్రమంలో పార్టీని నిలబెట్టడానికి నేతలు చేసిన త్యాగం గురించి ఆయన వివరించారు. ఇక ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సీనియర్ నేతలు బలరాం నాయక్, సంభాని చంద్రశేఖర్, మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, వేణు గోపాల్, అనుబంధ సంఘాల ఛైర్మన్లు మెట్టు సాయి, నూతి శ్రీకాంత్, సునీతా రావ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకే నాడు కాంగ్రెస్ పార్టీ స్థాపించారని, మహాత్మాగాంధీ తదనంతరం ఆయన స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగిస్తోందని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రంతో పాటు తొలి ప్రధానిని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని, జవహర్ లాల్ నెహ్రూతో పాటు ఆయన కుమార్తె ఇందిరా గాంధీ సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయాల వల్ల భారత్ బలమైన శక్తిగా అవతరించిందని అన్నారు. వారి తర్వాత రాజీవ్ గాంధీ నేతృత్వంలో దేశం పారిశ్రామికంగా, టెక్నాలజీ పరంగా గొప్ప ముందడుగు వేసిందని, తద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నేడు ప్రధాని మోదీ పాలనలో దేశంలోని ప్రజలు కష్టాలు పడుతున్నారని, దేశ సరిహద్దుల్లో పొరుగు దేశాలు ఆక్రమణలు జరుపుతుంటే అడ్డుకోలేని స్థితిలో బీజేపీ ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానికి పేద ప్రజల బాధలు కనిపించడం లేదని, కార్పొరేట్ అధిపతులకు మేలు చేసేలా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయని ఆరోపించారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని, ఎంతోమంది అమాయక బిడ్డలు బలిదానాలు చేసుకుంటుంటే చూడలేక అప్పటి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించారని రేవంత్ గుర్తు చేశారు. అయితే రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దోపిడీకి గురయిందని, ఆయన కుటుంబమే బాగుపడిందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలోని వైఫల్యాలను చూపడంతో పాటు, ప్రజలందరినీ ఐక్యంగా ఉంచేందుకే రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ చేస్తున్నారని తెలిపారు. దీనికి కొనసాగింపుగా జనవరి 26 నుంచి కాంగ్రెస్ పార్టీ ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’ చేపడుతోందని, దీనిని కూడా విజయవంతం చేయాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE