రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై మార్చ్ 19, గురువారం నాడు ప్రగతి భవన్ లో నిర్వహించిన అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ నిర్ణయాలను ఆయన వెల్లడించారు. నిర్లక్ష్యంగా ఉన్నచోటే కరోనా వైరస్ ప్రబలుతున్నదని, అందుకే రాష్ట్ర ప్రజలంతా జాగ్రత్తలు తీసుకుంటూ ముప్పు నుండి బయటపడాలని చెప్పారు. కరోనా వైరస్ సోకి, చికిత్స పొందుతున్న 14 మంది సురక్షితంగా ఉన్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నెల 28 వరకు బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, సెమినార్లు, ఉత్సవాలు, ఎగ్జిబిషన్స్, సాంస్కృతిక కార్యక్రమాలు అనుమతించబడవని. జూ పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కులు, మ్యుజియమ్స్, సినిమా హాళ్లు, బార్లు, పబ్బులు, క్రీడా ప్రాంగణాలు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేసి ఉంచాలని చెప్పారు.
రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని, ముందు ప్రకటించిన విధంగా అన్ని విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, సమ్మర్ క్యాంపులు మార్చ్ 31 వరకు మూసి ఉంటాయన్నారు. మాల్స్, సూపర్ మార్కెట్లు, ఇతర దుకాణాలు యథావిధిగా నడుస్తాయిని సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పి/కమీషనర్, జిల్లా వైద్యాధికారితో ఏర్పాటయ్యే కమిటీ జనం గుమి గూడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మార్చి 1 తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి, వైద్య పరీక్షలు నిర్వహించాలని అవసరమైన వారికి గృహ నిర్బంధం విధించాలన్నారు.
దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు మరియు ఇతర ప్రార్థనా మందిరాలలో భక్తులను అనుమతించవద్దని. వీలయినంతవరకు పండుగల్ని, ఉత్సవాల్ని ప్రత్యక్షప్రసారం చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రార్థనా మందిరాల్లో పరిశుభ్రతను పెంపొందించాలని పేర్కొన్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద 18 చెక్ పోస్టులు ఏర్పాటుచేసి ప్రయాణికులకు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. విదేశీ ప్రయాణం చేసినవారిని గృహ నిర్బంధంలో ఉంచుతామని. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా దక్షిణమధ్య రైల్వే అధికారులను కూడా కోరడం జరిగిందని మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ వెల్లడించారు.