“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా రెండో రోజున మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ రోజు వలస కూలీలు, హోసింగ్, గిరిజనుల ఉపాధి, వీధి వ్యాపారులు, చిన్న రైతులు, ముద్ర యోజన అంశాలకు కేటాయించిన నిధులు, సంబంధిత వివరాలను వివరించారు.
నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
వ్యవసాయం :
- 22 లక్షల కొత్త కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరు.
- కిసాన్ కార్డు దారులకు రూ. 25 వేల కోట్ల రుణాలు.
- వ్యవసాయ రుణాలపై మూడునెలల మారటోరియం.
- సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగింపు.
- మార్చి 1, 2020 నుంచి ఏప్రిల్ 30 మధ్య కాలంలో వ్యవసాయంలో రూ.86,600 కోట్ల 63 లక్షల రుణాలు ఆమోదించబడ్డాయి.
- మార్చి 2020 లో సహకార బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు నాబార్డ్ రూ.29,500 కోట్ల రీఫైనాన్సింగ్ అందజేత.
- గ్రామీణ ఇన్ఫ్రా కోసం మార్చి 2020లో రూ.4,200 కోట్లు అందజేత.
- మార్చి 2020 నుండి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు వర్కింగ్ క్యాపిటల్ పరిమితి రూ.6,700 కోట్లు మంజూరు.
వలస కార్మికులు:
- వలస కార్మికులకు భోజన, సహాయ శిబిరాల ఏర్పాట్లకు రాష్ట్రాలకు రూ.11 వేల కోట్లు కేటాయింపు.
- మార్చి 15 నుండి పట్టణ పేదల కోసం 7200 కొత్త స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశాం.
- వచ్చే 2 నెలలకు వలసదారులకు ఉచిత ఆహార ధాన్యాలు, దీనివల్ల 8 కోట్ల మంది వలసకార్మికులకు ప్రయోజనం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 3,500 కోట్లు కేటాయింపు.
- రేషన్ లేని కార్డు లేని వలస కూలీల కుటుంబాలకు గోధుమ లేదా బియ్యం 5 కిలోలు మరియు 1 కిలోల పప్పు ఉచితం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ చూపించాలి.
ఒక దేశం, ఒక రేషన్ కార్డు:
- ఇప్పుడు రేషన్ కార్డు కలిగిన వారు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా, ఏ రేషన్ షాపులోనైనా ఉపయోగించవచ్చు
- 23 రాష్ట్రాల్లో 63 కోట్ల మంది లబ్ధిదారులు వచ్చే ఆగస్టు నాటికి ఒక దేశం, ఒక రేషన్ కార్డు విధానం పరిధిలోకి వస్తారు.
- మార్చి 2021 నాటికి ఒక దేశం, ఒక రేషన్ కార్డు విధానం దేశమంతా అమలు.
పట్టణ పేదల నివాసం/అద్దె కోసం:
- పిఎం ఆవాజ్ యోజన కింద పట్టణాల్లో అద్దె గృహనిర్మాణ పథకం.
- పీపీపీ పద్ధతిలో గృహాల నిర్మాణం.
- వలస కార్మికుల నివాసానికి ఇబ్బంది లేకుండా నూతన పథకం.
- ఎక్కువగా గృహ నిర్మాణానికి ఖాళీ ప్రభుత్వ భూమిని వాడకం.
వీధి వ్యాపారులు:
- 50 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.5 వేల కోట్ల రుణ సాయం.
- ఒక్కొక్కరికి పదివేలు చొప్పున వర్కింగ్ క్యాపిటల్ కింద రుణం మంజూరు, నెలరోజుల్లో రుణం అందజేత.
హోసింగ్:
- 6 నుంచి 18 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికీ గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకం మరో ఏడాది పొడిగింపు.
- ఈ నిర్ణయం ద్వారా 5.8 లక్షల మందికిలబ్ది.
గిరిజన ఉపాధి:
- రూ. 6 వేల కోట్లతో గిరిజనులకు ఉపాధి కల్పించేలా క్యాంపా పథకం.
- నెలరోజుల్లో క్యాంపా పథకం ప్రారంభం. గిరిజనులకు అందుబాటులోకి రానున్న నగదు.
రైతులు:
–>కిసాన్ కార్డు లేని 2.5 కోట్ల రైతులకు 2 లక్షల కోట్ల అదనపు రుణాలు మంజూరు.
–>పశుపోషకులు, మత్స్యకారులకు కూడా రుణాలు అందజేస్తాం.
ముద్ర యోజన:
- ముద్ర పథకం కింద రూ.50 వేల లోపు శిశు రుణాలు తీసుకున్న వారికీ వడ్డీ రాయితీ.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu