జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం, వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల కాలువల ద్వారా సాగునీటిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, “తెలంగాణ ప్రజల దశాబ్దాల నాటి కలలు నెరవేరుతున్నాయి. సీఎం కేసీఆర్ సంకల్పం, ఆశీస్సులతో అవి ఆవిష్కారమవుతున్నాయి. తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులన్నీ దశల వారీగా పూర్తవుతున్నాయి. అవన్నీ రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలను పూయిస్తున్నాయి. దేవాదుల ప్యాకేజీ-46 దక్షిణ ప్రధాన కాలువ ద్వారా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్, వర్దన్నపేట, పరకాల నియోజకవర్గాల్లోని 8 మండలాలు, 33 గ్రామాలు జల కళని సంతరించుకున్నాయి. 91,700 ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం కానున్నదని ” అన్నారు.
నీటి విడుదల సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. పూలు, పసుపు కుంకుమలతో నీరాజనాలు పలికారు. నీటి పంపు పంపింగ్ ప్రారంభించగానే, కాలువల ద్వారా సాగునీటిని చూడటంతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు, నేతలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. నీటి విడుదల సమయంలో జై తెలంగాణ నినాదాలతో ధర్మసాగర్ రిజర్వాయర్ మిన్నంటింది. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, దేవాదుల ప్యాకేజీ-46 దక్షిణ ప్రధాన కాలువ 78.20కోట్ల వ్యయంతో, 16.90 కి.మీ. ప్రధాన కాలువ పొడవుతో నిర్మితమైన ఈ దక్షిణ కాలువ ద్వారా మూడు నియోజకవర్గాల్లోని 8 మండలాలు, 33 గ్రామాలకు 91,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతాయని తెలిపారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని 11 గ్రామాలలో 40,178 ఎకరాలు, వర్దన్నపేట నియోజకవర్గంలోని 11గ్రామాలలో 36,911 ఎకరాలకు, పరకాల నియోజవర్గంలోని 7 గ్రామాలలో 14,611 ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు.
తెలంగాణ వస్తే ఏమొస్తదన్న వాళ్ళందరికీ సాగునీటితో, అభివృద్ధితో, సంక్షేమంతో సీఎం కేసీఆర్ తగిన సమాధానం చెప్పారన్నారు. తెలంగాణ వచ్చాకే, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావస్తున్నది. దేవాదుల, ఎస్సారెస్పీ కాలువల నీరు అందివస్తున్నది. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పని చేస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ కోటి ఎకరాల సస్యశ్యామల మాగాణ అవుతుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఇప్పటికే దేశంలో ధాన్యం దిగుబడుల్లో తెలంగాణ నెంబవర్ వన్ స్థానానికి చేరిందన్నారు. రాష్ట్రంలో గత సీజన్ లో 40 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం పండిందన్నారు. 20 లక్షల ఎకరాల్లో మక్క, జొన్న, ఇతర పంటలు పండాయన్నారు. మరో 40 లక్షల ఎకరాలకు పంటలు పండే నీటిని అందిస్తే కేసీఆర్ కల, ప్రజల కల సాకారమవుతుందని, తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని, దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రైతు ఎదుగుతారని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్ తదితరులు మాట్లాడారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అనేక మంది ప్రజలు, సాగునీటి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu