ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసపై కేసులు నమోదు చేసి, బాధ్యులను అరెస్టు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 26, బుధవారం నాడు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ఢిల్లీలో అల్లర్లు, హింసాత్మక పరిస్థితులు ఏర్పడంపై పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల కోసం పోలీసులు వేచి ఉండకూడదని, స్వయంగా చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేస్తూ ఢిల్లీ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం సీనియర్ స్థాయి పోలీస్ అధికారి ప్రత్యక్షంగా కోర్టుకు హాజరై ఢిల్లీలో తాజా పరిస్థితులపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఈశాన్య ఢిల్లీలోని సీబీఎస్ఈ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని విద్యార్థులకు అప్పటికప్పుడు కాకుండా ముందే ఇవ్వాలని సీబీఎస్ఈ బోర్డుకు సూచించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వచ్చే 10-15 రోజుల షెడ్యూల్పై నిర్ణయం తీసుకుని, సరైన ప్రణాళికలతో ఈ రోజు మధ్యాహ్నం కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
మరోవైపు ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 20 మంది మృతి చెందినట్టుగా ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్(జీటీబీ) ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అలాగే 56 మంది పోలీసు సిబ్బందితో సహా 180 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వీధుల్లో పెద్దఎత్తున మోహరించారు. మౌజ్పూర్, చాంద్బాగ్, గోకుల్పురి, జఫ్రాబాద్, కర్వాల్ నగర్ తదితర ప్రాంతాల్లో పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో కర్ఫ్యూ విధించారు. అలాగే పోలీసులు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పరిస్థితిని నియంత్రించలేకపోతున్నారని ప్రజలలో విశ్వాసం కలిగించేందుకు సైన్యాన్ని మోహరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు.
[subscribe]